వార్డు సభ్యుడిపై టీడీపీ వర్గీయుల దాడి

25 Aug, 2014 00:43 IST|Sakshi
వార్డు సభ్యుడిపై టీడీపీ వర్గీయుల దాడి

చినకాకాని(మంగళగిరి రూరల్): నిడమర్రులో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకుడు, పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు తాడిబోయిన అంకమ్మరావుపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అంకమ్మరావు తన స్నేహితుడు నల్లిబోయిన వీరయ్యతో కలసి శనివారం రాత్రి రజక కాలనీలో కూర్చునివున్నారు.
 
అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తాడిబోయిన మల్లయ్య, కుర్రా  శంకరరావు, తాడిబోయిన వెంకటేశ్వరరావు, కుర్రా వీరయ్య, తాడిబోయిన సీతారామయ్య, తాడిబోయిన సుబ్బారావులతోపాటు మరో నలుగురు వచ్చి ఆకస్మాత్తుగా దాడి చేసి గాయపర్చారని స్థానికులు చెప్పారు. గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరడంతో దాడికి పాల్పడినవారు పరారయ్యారు. గాయపడిన అంకమ్మరావు, వీరయ్యలను 108లో చినకాకాని ఎన్నారై  వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
బాధితులకు ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ
పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు అంకమ్మరావు, నల్లిబోయిన వీరయ్యను ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించి వారి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడం వేనుక అధికార పార్టీ అండదండలున్నాయని చెప్పారు. భౌతిక దాడులు మంచి పరిణామం కాదని, ఇప్పటికైనా మానుకోకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
 
పార్టీ కార్యకర్తలు దాడులకు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఇప్పటికే తాను పోలీసు అధికారులతో మాట్లాడి దాడి ఘటనలో నిందితులు ఎంతటి వారైనా పట్టుకుని శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, తాడిబోయిన వలరాజు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి,  సొసైటీ డెరైక్టర్ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి శేషిరెడ్డి తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు