ఆదర్శాలు, విలువలు ఇలాంటి మాటలు ఆ ఇలాకాలో వాడకూడదు. నీతి, నిజాయితీ ఈ పదాలను కూడా పెదాలపైకి తీసుకురాకూడదు. ఉన్నదల్లా ఒక్కటే అవినీతి. చేసేదంతా ఒక్కటే అక్రమం. ప్రసంగాల్లో బుద్ధిమంతుడి మాటలు చెప్పే మంత్రి అచ్చెన్న చేసే తెరచాటు యవ్వారాలు వివరించడానికి రోజులు సరిపోవనేది స్థానికుల మాట. పదేళ్ల తర్వాత చేతికి అందిన అధికారాన్ని జనం కోసం కాకుండా ధనం కోసం మాత్రమే అచ్చెన్న వాడుతున్న తీరు ప్రజాస్వామ్యవాదులను విస్తుగొలుపుతోంది. జిల్లాలో ఏ రంగాన్నీ వదలకుండా చేస్తున్న దోపిడీ చూస్తున్న వారి మతులు పోగోడుతోంది. మి(ని)స్టర్ అవినీతి గురించి లోతుల్లోకి వెళ్తే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం రాక రాక పదేళ్ల తర్వాత అధికారం చేతికొచ్చింది! వచ్చిందే మొదలు కాసులు కురిపించే ఏ రంగాన్నీ టీడీపీ నాయకులు వదిలిపెట్టలేదు! ఇది రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో అవినీతి మరింత పెచ్చుమీరింది. ఆయన అండదండలే ఆసరాగా సోదరుడు సహా టీడీపీ తమ్ముళ్ల కుమ్ముడుకు అడ్డే లేకుండా పోయింది. కనిపించిన ఏ ప్రభుత్వ స్థలాన్నీ వదిలిపెట్టలేదు. చివరకు చెరువులను సైతం కబ్జా చేస్తున్నా మంత్రి ఏ మాత్రం వారించలేదు. లిక్కరు మాఫియా, ఇసుక మాఫియాకు సైతం టెక్కలి నుంచే అండదండలు అందుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు.
అనుచరులు తోడుగా..
అచ్చెన్న అనుచరులైన టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు కనబడితే చాలు కబ్జా చేస్తూ వచ్చారు. గత నాలుగున్నరేళ్లలో పలు చోట్ల ప్రభుత్వ భూములనే కాదు చెరువులు, మెట్టలు, కొండలు వారి వశమయ్యాయి. అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లతో తలొగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వ పథకాల్లోనూ..
తిత్లీ తుఫానులో దోపిడీ బీభత్సం
గత ఏడాది అక్టోబరు 10వ తేదీన సంభవించిన తిత్లీ తుఫానుతో ప్రజలు నష్టపోయినా టీడీపీ నాయకుల జేబులు మాత్రం నిండాయి. పరిహారం కోసం పంటలు లేకపోయినా ఉన్నట్లు రాయించడం, కొంత నష్టమే జరిగితే అధికంగా నమోదు చేయించడం వంటి అక్రమాలకు తెగించారు. చివరకు మంత్రి అచ్చెన్న కుటుంబసభ్యుల పేర్లుతో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసి రూ.కోటి వరకూ దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అదనుగా మిగతా టీడీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. చివరకు తుఫానుతో గూడు కోల్పోయిన నిరాశ్రయులకు పంపిణీ చేయాల్సిన పరదాలు, సోలార్ లాంతర్లను పక్కదారి పట్టించిన దాఖలాలు కోకొల్లలు. కొంతమంది నాయకులు పరదాలను ప్రైవేటు దుఖాణాలకు అమ్ముకున్నారంటే వారి కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.
పింఛన్లనూ వదలని తమ్ముళ్లు..
మంత్రి అచ్చెన్నాయుడు అండతో వివిధ రకాల సంక్షేమ పథకాల్లోనూ టీడీపీ నాయకులు దోపిడీ పర్వం కొనసాగించారు. ఒక్కో రకం పింఛనుకు ఒక్కో మాదిరిగా అక్రమ వసూళ్లకు పా ల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరులో మూడు నెలల పాటు లబ్ధిదారునికి పింఛన్ ఇవ్వకుండా చివరి నెలలో ఒక నెల డబ్బును కొట్టేస్తున్నారు.
నీరు–చెట్టులోనూ అచ్చెన్న సోదరుడికే పెద్దపీట
గత ఏడాది ‘నీరు–చెట్టు’ పథకం కింద వంశధార ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు ఆహ్వానించిన పనుల్లో రూ.4.04 కోట్లు విలువలైన 12 పనులు సురేష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకే దక్కాయి. వేరేవ్వరికైనా ఒకటీ రెండు పనులు దక్కితే నానాయాగీ చేసే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరెందుకు మిన్నకుండిపోయారంటే... ఆ సంస్థ సాక్షాత్తూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి సోదరుడైన కింజరాపు హరివరప్రసాద్కు చెందినది కావడమే.
జిల్లాలో నీరు–చెట్టు పథకం 2015 జూన్లో ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది. టెక్కలి నియోజకవర్గానికే 2016–17లో జిల్లాలోనే అత్యధికంగా రూ.117.13 కోట్ల విలువైన 1,319 పనులు కేటాయించగా, వాటిలోనూ కోటబొమ్మాళి మండలానికే రూ.60 కోట్ల విలువైన 474 పనులిచ్చారు. వాటిలో ఎక్కువ పనులు తూతూమంత్రంగా చేసి బిల్లులు జేబులో వేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది టెండర్లలోనూ అత్యధిక పనులు కింజరాపు కుటుంబసభ్యులు, ఆయన అనుయాయులకే దక్కడం గమనార్హం.
మంత్రి సోదరుడి నేతృత్వంలోనే..
మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలోనే టెక్కలి నియోజకవర్గంలో కొన్ని రకాల అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిలో నిమ్మాడ ఎఫ్సీఐ గొడౌన్ వద్ద అక్రమాలు, కల్తీ మద్యం మాఫియా, మైన్స్ మాఫియాతో సంబంధాలే కాకుండా ఏ శాఖలోనైనా తన సొంత కాంట్రాక్ట్ సంస్థకు టెండర్లు దక్కించుకోవడానికి బరి తెగిస్తున్నారు. నిమ్మాడ ఎఫ్సీఐ గొడౌన్ వద్ద మంత్రి సోదరుడు కింజరాపు హరిప్రసాద్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.
నిమ్మాడ, కొత్తపల్లి, అక్కయ్యవలస, కోటబొమ్మాళి ప్రాంతాల్లో హరిప్రసాద్ కనుసన్నల్లో లిక్కర్ మాఫియా కార్యకలాపాలు సాగిస్తోంది. చీఫ్ లిక్కర్ను ఖరీదైన మద్యంలో కల్తీ చేయడం, నకిలీ మూతలతో బ్రాండ్లు సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి సోదరుడే ప్రధాన అండ అనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఖరీదైన గ్రానైట్ బ్లాకులు మంత్రి సోదరునికి చెందిన పాలిషింగ్ యూనిట్లకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి మైన్స్ అధికారులు సైతం అండగా ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
కార్పొరేషన్ రుణాల మంజూరులో చిలక్కొట్టుడు
అర్హులకు అందాల్సిన వివిధ రకాల కార్పొరేషన్ రుణాలకు సంబంధించి టీడీపీ నాయకులు చిలక్కొట్టుడు వ్యవహారానికి పాల్పడుతున్నారు. మండల స్థాయి నాయకులు, టీడీపీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలదే కీలక పాత్ర. ఇటీవల టెక్కలి చిన్నబజారులో కొత్తగా నిర్మించిన పంచాయతీ దుకాణాల కేటాయింపు దీనికి ఉదాహరణ. నందిగాంలో కొత్తగా వెలసిన కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులోనూ ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయల వరకూ వసూళ్లకు పాల్పడ్డారు.
సంతబొమ్మాళి మండలంలో వివిధ రకాల కార్పోరేషన్ రుణాల మంజూరులో అధికంగా వసూలు చేశారు. రైతురథాల పేరుతో అర్హులైన రైతులకు అందాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను అత్యధికంగా టీడీపీ నాయకులకే అడ్డగోలుగా కట్టబెట్టారు. వారిలో సంతబొమ్మాళి ఎంపీపీ కర్రి కృష్ణవేణి భర్త కర్రి విష్ణుమూర్తి, వైస్ ఎంపీపీ సూరాడ భీమారావు కూడా ఉన్నారు. కోటబొమ్మాళి మండలంలో కార్పొరేషన్, సొసైటీ రుణాల మంజూరు మంత్రి అచ్చెన్న కనుసన్నల్లో జరిగింది.