దబాయింపు.. బుకాయింపు

30 Aug, 2019 08:46 IST|Sakshi
ప్రభుత్వ సిబ్బందిని బెదిరిస్తున్న కూన రవికుమార్‌ (ఫైల్‌)

తప్పు ఒప్పుకోకుండా టీడీపీ  నేతల వితండవాదం

ప్రభుత్వ సిబ్బందిపై నోరు  పారేసుకుని ఆపై ఎదురుదాడి 

కూన రవికుమార్‌ తీరును తప్పుపడుతున్న ప్రజలు

సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేస్తుంటే ఓర్వలేనితనం

టీడీపీ ప్రభుత్వ పాపాలను గుర్తుకు తెచ్చుకుంటున్న ప్రజలు 

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కాదని టీడీపీ నేతలకు నిధులిచ్చిన  గత సర్కారు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాలకొండ, రాజాం నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుండగా వారిని పక్కన పెట్టి తమ పార్టీకి చెందిన నిమ్మక జయకృష్ణ, కావలి ప్రతిభాభారతి పేరుతో ప్రత్యేక జీవోలిచ్చి నిధులు విడుదల చేసిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుంది. ఎమ్మెల్యేలకు విధిగా నిధులు ఇవ్వాల్సిందిపోయి వారి చేతిలో ఓడిపోయిన నేతల పేరుతో అధికారిక జీవోలు ఇచ్చిన ఘనత మీదేనని విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు మండల పరిషత్‌ కార్యాలయాలకు వస్తున్నారని, కార్యాలయంలో కూర్చొంటున్నారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తుంటే... మండల కార్యాలయాల్లోకి  తాము తప్ప మరెవ్వరూ రాకూడదన్నట్టుగా ఇంకా అధికార దర్పం ప్రదర్శిస్తుంటే.. ఇంకా మీరే అధికారంలో ఉన్నట్టు కలలు కంటున్నారా అని జనం హేళన చేస్తున్నారు.

నోరు పారేసుకుని.. ఆపైన ఎదురుదాడి.. 
ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొని ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లతో అడ్డంగా దొరికిపోయినప్పటికీ టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తప్పులు సరిదిద్దుకోకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. అధికారులపై అనుచితంగా ప్రవర్తించి తప్పు చేయలేదని మొండి వైఖరి అవలంబిస్తున్నారు. వీరి వ్యవహార శైలిని, నోటి దురుసును లోకమంతా చూసి నివ్వెరపోతున్నా... వీరికి మాత్రం సిగ్గు రావడం లేదు. తప్పులు చేసి ఎదుట వారిపై నిందారోపణలు వేస్తున్నారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ల తీరును సర్వత్రా తప్పు పడుతున్నా టీడీపీ నేతలు మాత్రం సమర్ధించుకునేలా మాట్లాడుతున్నారు. అసలు మండల అధికారులపై అంతా చూస్తుండగానే విరుచుకుపడ్డారు. కూన రవికుమారైతే ఏమాత్రం తగ్గకుండా స్పందన కార్యక్రమంలో ఇష్టారీతిన మాట్లాడారు. దాడి చేసినంతగా పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నాకు రెస్పాండ్‌ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చొంటా... ఎవ్వరూ నన్ను ఆపలేరు.

ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా’నంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరావుపై కూన రవికుమార్‌ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతకుముందు ఓ మహిళా ఉద్యోగికి ఫోన్‌ చేసి మరీ బెదిరింపులకు దిగారు. ఇదంతా రికార్డయింది. బాధిత ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే... కూన రవికుమార్‌ పరారీ అయ్యారు. ఒక కేసు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యక్తి కోసం గాలిస్తారు. అందులో భాగంగా కూన రవికుమార్‌ ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. ఇదంతా పోలీసు విధి నిర్వహణలో భాగమని అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ నేతలకు మాత్రం కక్షసాధింపుగా కన్పించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఎదురుదాడికి దిగుతున్నారు.

రవికుమార్‌ది తప్పు కాదా?
అసలు కూన రవికుమార్‌ చేసినది తప్పా? ఒప్పా? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు కక్ష సాధింపేంటో గత ఐదేళ్ల కాలంలో టీడీపీ వైఖరిని చూస్తే తెలుస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో అక్రమ అరెస్టులకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు దువ్వాడ శ్రీనివాస్‌పై అనుసరించిన వైఖరినే తీసుకోవచ్చు. క్వారీ, పవర్‌ ప్లాంట్‌ వ్యవహారాల్లో తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దువ్వాడ శ్రీనివాస్‌ ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ నాడు మంత్రిగా వెలగబెట్టిన అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరిగింది. చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్‌ను  టార్గెట్‌గా చేసి, కక్ష సాధింపునకు దిగి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు.

ఇదొక్క ఉదాహరణ మాత్రమే. జిల్లాలో అనేక మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకోకుండా కేవలం వైఎస్సార్‌సీపీ నేతలు మండల పరిషత్‌ కార్యాలయాల్లోకి వెళ్తున్నారని, అక్కడ కూర్చొంటున్నారని, సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేస్తున్నారని చెప్పి అధికారులపై నోరు పారేసుకుని, అపై అడ్డంగా దొరికిపోయి, ఉద్యోగులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే... దాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కక్ష సాధింపని రాజకీయ లబ్ధి కోసం ఎదురుదాడికి దిగుతున్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు పంథాలోనే జిల్లా టీడీపీ నేతలు నడుస్తున్నారు. జరిగింది తప్పు... పొరపాటున మాట్లాడాను... క్షమాపణ చెబుతున్నా... అని ఉంటే కాస్త హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా, చేసిన తప్పును కప్పిపుచ్చుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

పదిమంది నిందితులకు బెయిల్‌ మంజూరు..
ఆమదాలవలస: సరుబుజ్జలి ఎంపీడీఓను బెదిరించి, అనుచితంగా మాట్లాడిన, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో అరెస్టయిన   పదిమంది నిందితులకు గురువారం బెయిల మంజూరైంది. వీరిని బుధవారం అరెస్ట్‌ చేసి   కోర్టు నుంచి శ్రీకాకుళం సబ్‌జైల్‌కు  రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఆ పదిమందికి ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి గురువారం పూచీకత్తులపై బెయిలు మంజూరు చేసినట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. ఒక్కో ముద్దాయికి ఇద్దరు పూచీకర్తులతో రూ.10 వేలు జామీను అమౌంట్‌తో బెయిల్‌ మంజూరు చేసినట్లు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు