తెలుగు తమ్ముళ్ల కక్ష సాధింపు

23 May, 2018 16:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ అక్రమాలకు అడ్డొస్తున్నారనే అక్కసుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీఐ రాజశేఖర్‌ను సస్పెండ్ చేయించారు. నగరంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న పేకాట, అవినీతిని అక్రమాలను రాజశేఖర్‌ అడ్డుకుంటున్నారు. తమ ఆటలు సాగడం లేదన్న కోపంతో ఆయనపై తెలుగు తమ్ముళ్లు కక్ష కట్టారు. కొన్నిరోజుల క్రితం టీడీపీ నేతల ఒత్తిడితో రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు విఆర్‌లోకి పంపించారు.

ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ప్రస్తావించారు. రాజశేఖర్‌ గురించి సభలో ప్రస్తావించడంతో టీడీపీ నాయకులు కక్ష సాధింపుతో  సీఐను అదేరోజు ఏకంగా సస్పెండ్‌ చేయించారు. రాజశేఖర్‌ను తామే సస్పెండ్‌ చేయించినట్టు టీడీపీ నేత, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు మీడియా ముఖంగా ప్రకటించారు. విఆర్‌లోకి కాదు‌ ఏకంగా సస్పెండ్‌ చేయించామని గొప్పలు పోయారు. తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఎలా ఊరుకుంటామని ఎదురు ప్రశ్నించారు. ఈ మాటలను బట్టి  టీడీపీ కక్ష సాధింపులో భాగంగానే సీఐ రాజశేఖర్‌పై చర్య తీసుకున్నారని స్పష్టమయింది.

మరిన్ని వార్తలు