పాఠశాలలో విందు, మందు

1 Apr, 2019 12:32 IST|Sakshi
పాఠశాలలో పంపకాలు చేస్తున్న టీడీపీ నాయకులు

శాంతిపురం : ఎన్నికల నియమావళి తమకు పట్టదన్నట్లు అధికార టీడీపీ నాయకులు నానాటికీ బరితెగిస్తున్నారు. ఆదివారం పట్టపగలు సోగడబళ్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మద్యం, బిర్యానీలు పంచుకుని దర్పం చూపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా ప్రచారంలో పాల్గొన్న వారికి మధ్యాహ్న భోజనంగా గ్రామం చివరన ఉన్న పాఠశాల వరండాలో బిర్యానీ ఏర్పాటు చేశారు. ప్యాకెట్లు పంచుకుని అక్కడే భోజనాలు కానిచ్చారు.

కొందరు పచ్చ బాబులు మద్యం మత్తులో కేకలు వేయటంతో గమనించిన స్థానికులు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో జరిగిన తంతును వీడియో తీసి అధికారులకు పంపారు. అధికారులు అక్కడికి వస్తున్న సమాచారం ముందుగానే తెలుసుకున్న టీడీపీ శ్రేణులు క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. విద్యాలయాల్లో దుశ్చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు