అయ్యయ్యో..!

12 Dec, 2018 13:10 IST|Sakshi

తెలంగాణ ఫలితాలతో నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు

ఎన్నికల వేళ జిల్లా నేతలు హైదరాబాద్‌లో మకాం

నగదు పంపిణీలోనూ క్రియాశీలకం

రూ.కోట్లు కుమ్మరించినా ఫలితం శూన్యం

ఫలితాల దెబ్బకు ముఖం చాటేసిన మంత్రులు సోమిరెడ్డి, నారాయణ

భారీ ఖర్చుతో పాటు పరువుపోయిందని ఆందోళన

తెలంగాణ ఎన్నికల్లో జిల్లా టీడీపీ నేతలుచేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలసమయంలో కులాల వారీగా ముఖ్య నేతలుహైదరాబాద్‌లో మకాం వేశారు. భారీఎత్తున డబ్బు మూటలు తరలించారు. ప్రచారం నుంచి ధనంపంపిణీ వరకు అన్ని చూసుకున్నారు. ఇంకేం గెలుపు మనదే అనుకున్నారు.  సెమీఫైనల్స్‌గా భావించిన ఎన్నికల రణరంగంలో టీడీపీ అభ్యర్థులు కేవలం ఇద్దరే గెలవడంతో నేతలకు ఊహించని రీతిలో భారీ షాక్‌ తగిలింది. ఒక్కసారిగా పార్టీ నేతలు, క్యాడర్‌ నైరాశ్యంలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణరాజకీయాలపై మాట్లాడే రాష్ట్ర మంత్రులు ఫలితాల సరళి చూశాక ముఖం చాటేశారు. అధికార పార్టీ నేతలు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం నుంచి నిన్నటి వరకు భారీగా ప్రచారం చేసి మనమే వెళ్లి గెలిపించబోతున్నామంటూ హడావుడి చేశారు.చివరకు డిపాజిట్లు కూడా రాకపోవడం, రానున్నరాష్ట్ర ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయనే ఆందోళన అధికార పార్టీ శ్రేణుల వెన్నుల్లోవణుకు పుట్టిస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నవంబర్‌ నుంచి జిల్లా రాజకీయాల్లో తెలంగాణ ఎన్నికలపైనే విస్తృత చర్చ సాగింది. ముఖ్యంగా అక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని స్థానికంగా ఇటు అధికార పార్టీ క్యాడర్, అటు కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే బహిరంగంగా మాట్లాడకపోయినా భారీగా నష్టపోతామనే భావన మాత్రం ఇరుపార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈ ప్రచారాన్ని అధిగమించడానికి అధికార పార్టీ డబ్బు మొదలుకుని కులం కార్డు వరకు అన్ని రకాల జిమ్ముక్కులు చేసి చివరికి భారీగా బోల్తా పడ్డారు. గత నెల చివర్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ హైదరాబాద్‌ నగరంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరిలో ఒక నేత అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో భారీగా నగదు కూడా తెలంగాణా ఎన్నికల్లో పంచారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇంత చేసినా ప్రజాతీర్పు ఉహించని రీతిలో ఉండటంతో నేతలు తలలు పట్టుకున్నారు.

ముఖం చాటేశారు
ఇక నిత్యం జిల్లాలో హడావుడి చేసి రాష్ట్ర రాజకీయాలు మొదలుకుని దేశ రాజకీయాల వరకు మాట్లాడే మంత్రులు కూడా ఎన్నికల ఫలితాల ముందు వరకు మçహాæ కూటమిదే ఘనవిజయం అంటూ స్థానికంగాబలంగా ప్రచారం చేసి పరోక్షంగా బెట్టింగ్‌ల జోరుకు మరింత ఊపు తెచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక నేతలు పూర్తిగా ముఖం చాటేశారు. ముఖ్యంగా మంత్రి నారాయణ అయితే ముందస్తు షెడ్యూల్‌ను కూడా రద్దు చేసుకుని క్యాంప్‌ కార్యాలయానికే పరిమతమయ్యారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో తన సామాజికవర్గ ఓటర్లను, సెటిలర్స్‌ ఆకట్టుకోవడానికి ప్రచారంలో హడావుడి చేశారు. నగర మేయర్‌ మలక్‌పేటలో మైనార్టీలను ఆకట్టుకోవటానికి అక్కడే మకాం వేసి వచ్చారు. అలాగే బీద రవిచంద్ర కూడా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోపాటు గట్టిగా షాక్‌ ఇవ్వటంతో నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

బాబు తప్పిదాల వల్లే..
మరోవైపు తెలంగాణలో కూకట్‌పల్లిపై ఎక్కువమంది జిల్లా శ్రేణులు దృష్టి నిలిపారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని విజయం కోసం జిల్లాకు చెందిన అనేకమంది అక్కడికి వెళ్లి నగదు పంపిణీ నుంచి అన్ని విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అక్కడ కూడా భారీ పరాజయం పాలుకావటంతో నందమూరి కుటుంబాన్ని బాబు బలిపశువును చేశారనే అభిప్రాయాం ఎన్టీఆర్‌ అభిమానుల్లో బలంగా ఉంది. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసమే సుహాసినీ రాజకీయాల్లో తెచ్చి అభాసుపాలు చేశారని మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబునాయుడు వల్లే కూటమి ఓడిపోయిందని కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. బాబు తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నామని చెబుతున్నారు. మొత్తంగా సెమీఫైనల్స్‌గా భావిస్తున్న తెలంగాణ ఎన్నికలు టీడీపీకి గట్టి షాక్‌ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది.  

మరిన్ని వార్తలు