కావలి టీడీపీలో నిధుల కోసం కొట్లాట

1 Sep, 2018 13:13 IST|Sakshi

చైర్‌పర్సన్‌ భర్త, కౌన్సిలర్ల మధ్య వివాదం

అసభ్య పదజాలంతో దూషణలు

మున్సిపల్‌ నిధుల పంపకంపై మొదలైన రభస

పార్టీ పెద్దలకు చైర్‌పర్సన్‌ అలేఖ్య ఫిర్యాదు

నెల్లూరు, కావలి: కావలి మున్సిపాలిటీ నిధుల కోసం అధికార తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కొట్లాడుకున్నారు. చైర్‌పర్సన్‌ అలేఖ్య భర్తకు, కౌన్సిలర్లకు మధ్య తారాస్థాయిలో వివాదం జరిగింది. రాయలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఒకరిపై, ఒకరు దూసుకు వచ్చి తన్నుకోబోయారు. మధ్యవర్తులు సర్దుబాటు చేసి బయటకు పంపేశారు. ఈ ఘటన గురువారం రాత్రి కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఇది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. శుక్రవారం కావలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుతుండడంతో ముందు రోజైన గురువారమే టీడీపీ కౌన్సిలర్లు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

కౌన్సిలర్లలో ఉన్న విభేదాలు కౌన్సిల్‌ సమావేశంలో బయటపడితే పార్టీ నవ్వుల పాలవుతుందని పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు  చేసిన ఏర్పాటు ఇది. అందులో భాగంగానే గురువారం టీడీపీ కౌన్సిలర్లు ఆ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఈ సమావేశానికి చైర్‌పర్సన్‌ అలేఖ్య, ఇతర టీడీపీ కౌన్సిలర్లు, మున్సిపల్‌ డీఈ విజయలక్ష్మి, ఏఈ బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాక ముందు 15వ వార్డు కౌన్సిలర్‌ ఉప్పు వెంకస్వామి తన వార్డులో ఆక్రమణ స్థలంలో నిర్వహిస్తున్న చికిన్‌ షాపును తొలిగించాలని 51 నెలలుగా అడుగుతున్నానని, దానిని తొలిగించే చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ వివాదానికి దిగారు. ఈ విషయం పార్టీ నాయకుడు బీద మస్తాన్‌రావుకు ఫోన్‌లో తెలియజేయడంతో అసలు సమావేశాన్ని రద్దు చేయాలని ఆయన అన్నట్లు తెలిసింది. అయితే అలేఖ్య ఫోన్‌లో నచ్చజెప్పడంతో మస్తాన్‌రావు సమావేశాన్ని నిర్వహించాలని తెలిపినట్లు సమాచారం.

చైర్‌పర్సన్‌ వార్డులో నిధుల కేటాయింపుపై వివాదం
అలేఖ్య కౌన్సిలర్‌గా ఉన్న వార్డులో పార్కుకు రూ.30 లక్షలు కేటాయించుకుని, వాటిని నామినేషన్‌పై చేయడానికి ఆరు భాగాలు చేసి కౌన్సిల్‌ సమావేశపు అజెండాలో ఆరు అంశాలుగా పొందుపరచడాన్ని 22వ వార్డు కౌన్సిలర్‌ చిన్ని ప్రశ్నించారు. కావలి పట్టణంలో చాలా వార్డుల్లో పార్కులు ఏళ్ల తరబడి నిర్మించకుండా ఆపేశారని, ఒక్క వార్డులోనే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించుకోవడం ఏమిటని అలేఖ్యను ప్రశ్నించారు. తాను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని నిధులు కేటాయించానని అలేఖ్య సమాధానం చెప్పగా, చైర్‌పర్సన్‌గా పట్టణం అంతా చూడాలని కౌన్సిలర్‌ చిన్ని అన్నారు. దీంతో సమావేశంలోనే ఉన్న ఆమె భర్త శ్రీకాంత్‌ ఆగ్రహానికి గురయ్యాడు. కౌన్సిలర్‌ చిన్ని పట్ల దురుసుగా మాట్లాడడంతో ‘చైర్‌పర్సన్‌గా అలేఖ్యను ప్రశ్నిస్తే నువ్వేంది మాట్లాడేది.. అయినా కౌన్సిలర్ల సమావేశానికి భర్త రావడం ఏంటి’ అని చిన్ని ప్రశ్నించారు.

దీంతో శ్రీకాంత్‌ 33వ వార్డు కౌన్సిలర్‌ అమరా విజయలక్ష్మి భర్త వేదగిరిని చూపుతూ ‘ఆయన వచ్చాడు కదా’ అని సమర్థించుకున్నారు. అయితే వేగదిరి మౌనం దాల్చడంతో, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షుడు హోదాలో ఏసమావేశానికైనా రావచ్చు, కౌన్సిలర్‌గా ఉన్న భార్య రాకపోవడంతోనే ఆమె భర్త వచ్చాడని కౌన్సిలర్‌ చిన్ని తెలిపారు. ఇంతలో 37వ వార్డు కౌన్సిలర్‌ వడ్లమూడి వెంకటేశ్వర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. అలేఖ్య భర్త శ్రీకాంత్, కౌన్సిలర్‌ వడ్లమూడి అసభ్యకర పదజాలంతో ఒకరినొకరు దూషించుకుంటూ కలబడబోయారు. వారిద్దరూ మున్సిపాలిటీ నిధులను ఏవిధంగా లూటీ చేసింది ఒకరికొకరు బయటపెట్టుకున్నారు. అవన్నీ విన్న మిగిలిన టీడీపీ కౌన్సిలర్లు నివ్వెరపోయారు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కౌన్సిలర్‌గా గెలిచి, టీడీపీలోకి రాబట్టే మున్సిపాలిటీ మీకు దక్కింది.. ఈ విషయాన్ని మర్చిపోయి ఏవేవో మాట్లాడితే ఎలా అంటూ టీడీపీ కౌన్సిలర్లకు గుర్తుచేశారు. ఇంతలో అక్కడున్న వారు సర్దుబాటు చేసి అందరినీ అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఇదిలా ఉండగా అలేఖ్య ఎప్పటి లాగానే పార్టీలోని ముఖ్యులకు ఫోన్‌లు చేసి టీడీపీ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్లు తమపట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులు చేయసాగారు.

>
మరిన్ని వార్తలు