సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. శనివారం అనంతపురం అర్భన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా పలువురు టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు జకీవుల్లాకు టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు జకీవుల్లా, జయరాంనాయుడు, లక్ష్మీపతి డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించలేదని వారు తెలిపారు. మళ్లీ ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారు.
టిక్కెట్ రాకుండా అడ్డుపడుతున్నారు : నరసింహయాదవ్
చిత్తూరు : తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ అసమ్మతి బాట పట్టారు. శనివారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి తన అసమ్మతిని తెలియజేశారు. పార్టీలో కొందరు వ్యక్తులు తనకు టిక్కెట్ రానీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు ఈ సారి ఎందుకు టిక్కెట్ ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.