అధికారందే పైచేయి

4 May, 2015 03:49 IST|Sakshi
అధికారందే పైచేయి

డీసీసీబీ ఛెర్మైన్‌ పదవిని వశపర్చుకున్న టీడీపీ
అడ్డదారులు...వక్రబుద్ధిలో  ‘దేశం’ నేతలు
అపహాస్యం పాలైన ప్రజాస్వామ్యం

 
సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబీ ఎన్నికల విషయంలో మొదటి నుంచి అధికారం అండతో టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. జిల్లాలో 77 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఓడిపోతామని భావించిన 21 సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నాటి కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. 54 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే 34 సంఘాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

కేవలం 16 సంఘాలు కాంగ్రెస్, 4 మాత్రమే టీడీపీ దక్కించుకుంది. చట్టంలోని లొసుగుల కారణంగా 18 సంఘాలకు చెందిన అధ్యక్షులకు ఓటుహక్కు లేకుండా చేశారు. వారిలో 13 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉండటం విశేషం. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ కారణంగా 10 మంది డీసీసీబీ డెరైక్టర్లలో నలుగుర్ని దక్కించుకున్నారు. బి గ్రూపు ఓట్లతో మరో రెండు డెరైక్టర్ల పదవులు దక్కించుకొని 6మంది డెరైక్టర్లు నాటి కాంగ్రెస్, నేటి టీడీపీ నేతలు వశం చేసుకున్నారు.

ఏ, బీ గ్రూపు ఓటర్ల ద్వారా 8 మంది డెరైక్టర్లను దక్కించుకొని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు ఇరగంరెడ్డి తిరుపేలురెడ్డి ఛెర్మైన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కోఆప్షన్ మెంబర్లను ఎన్నుకొని (ఎస్టీ మెంబర్ మినహా) డీసీసీబీ పాలకమండలిని కొనసాగిస్తున్నారు. రెండేళ్లు పదవీ కాలం సజావుగా సాగింది. అప్పటి కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, వరదరాజులరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు. మరోమారు ఆయా నేతలకు అధికారం అండ లభించింది. దాంతో ఛెర్మైన్ సీటుపై కన్నేశారు, తెరవెనుక పావులు చురుగ్గా కదిపారు. అధికారం కోసం ఎంతటి అనైతిక చర్యలకైనా వెనుకాడలేదు.

వెంటాడిన దురదృష్టం..
 డీసీసీబీ ఛెర్మైన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీకి ప్రతి అంశం అనుకూలంగా నిలుస్తూ వచ్చింది. అయితే వైఎస్సార్‌సీపీని మాత్రం దురదృష్టం వెంటాడింది. వెరసి ఛెర్మైన్ సీటును చేజార్చుకోవాల్సి వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఎస్టీ కోఆప్షన్ మెంబర్‌ను ఏనాడైనా నియమించుకునే అవకాశం ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మృతి చెందిన జమ్మలమడుగు డెరైక్టర్ స్థానాన్ని భర్తీ చేయడంలో అలక్ష్యం ప్రదర్శించారు.

19 మంది డెరైక్టర్లతో ఉన్న పాలకమండలిలో ఛెర్మైన్‌గా ఉన్న తిరుపాలురెడ్డి పదవి కోల్పోయాలా చేయడంలో అధికారపార్టీ చేసిన కుయుక్తులు ఫలించాయి.  అనంతరం 18 మందిలో ఇరువురు డెరైక్టర్లను అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు మరో ఎత్తుగడ వేశారు. వారు ఇరువురు అధికారులు ఏకపక్ష చర్యలకు పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి ఓటుహక్కు పొందారు. అయితే వారిలో ఒకరైన సరస్వతీపల్లె డెరైక్టర్ చిన్న ఓబులేసు వారంరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. దాంతో డెరైక్టర్ల సంఖ్యాబలం 17కు చేరింది. టీడీపీ ఎత్తుగడలను పసిగట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు ముందుగా 9మంది డెరైక్టర్లతో ఇడుపులపాయలో క్యాంపు నిర్వహించారు.

వారిలో ఒకరైన చిన్న ఓరంపాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న గురవయ్య అతని బంధువు మృతి చెందడంతో స్వగ్రామం వెళ్లారు. అక్కడికి వెళ్లిన డెరైక్టర్ గురవయ్యను తెలుగుదేశం పార్టీ ప్రలోభపెట్టి చేజిక్కించుకుంది. వెంటనే అతను టీడీపీ నిర్వహించిన క్యాంపులో చేరిపోయారు. 8మంది డెరైక్టర్లతోపాటు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి వర్గీయులైన ఇరువురు డెరైక్టర్లు నాగరాజనాయుడు, శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటారనే ధీమా ఆ పార్టీ నేతల్లో బలంగా ఉండిపోయింది.

అందుకు కారణం మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆ పార్టీ నేతలకు ఇచ్చిన హామీనే. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కుటుంబంతో దశాబ్దాల కాలంగా ఆయనకు ఉన్న వ్యక్తిగత వైరం కూడా మరో కారణం. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి వర్గీయులు ఇరువురు టీడీపీతో జతకట్టారు.దాంతో టీడీపీ శిబిరంలో 9 మంది, వైఎస్సార్‌సీపీ శిబిరంతో 8 మంది డెరైక్టర్లు నిలిచారు.

 

క్యాంపులో ఉన్న చిన్న గురవయ్యను అలాగే ఉంచుకున్నా, సరస్వతీపల్లె డెరైక్టర్ చిన్న ఓబులేసు ఆకస్మికంగా మృతి చెందక పోయినా టీడీపీ వారి కుయుక్తులను తిప్పికట్టి పదవిని నిలబెట్టుకునే అవకాశం ఉండేదని పలువురు వివరిస్తున్నారు. అన్ని విధాలా డీసీసీబీ ఛెర్మైన్ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీని దురదృష్టం వెంటాడుతూనే వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


 ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా...
  అధికారం ఉంటే ఏమైనా చేయగలం, చట్టాలు, ప్రజాస్వామ్యవ్యవస్థ అంతా బూటకమేనని అధికారపార్టీ రుజువు చేస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండి పడుతున్నాయి. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఇరువురు ఎంపీలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే దుగ్ధతోనే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా పదవిని దక్కించుకున్నారని ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మేధావులుగా చెప్పుకునే నాయకుల కంటే కూడా 8 మంది సాదా సీదా డెరైక్టర్లు తమ కళ్లముందు లక్షల కట్టలు చూపించినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం హర్షించదగ్గ పరిణామంగా వారు చెప్పుకొస్తున్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు పట్టం కడితే ఇతరుల బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్లుగా టీడీపీ నేతల వైఖరి ఉందని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు