మాజీ ఎంపీపీ, ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు వంద మంది టీడీపీ కార్యకర్తల చేరిక
పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
పెద్దతిప్పసముద్రం : పీటీఎం మాజీ ఎంపీపీ రేణుక, ఆమె భర్త రమణ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం మదనపల్లిలో తంబళ్లపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన రేణుక గతంలో కాంగ్రెస్ ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా కొనసాగారు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ను వీడారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో చేరి పార్టీ నాయకుల గెలుపు కోసం శ్రమించారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతో గత కొంతకాలంగా వీరు అధికార పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఇదే పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్లు రవీంద్రారెడ్డి, శ్రీరాములుతో పాటు వంద మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఎనిమిది వాహనాల్లో మదనపల్లికి చేరుకుని ద్వారకనాథరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ద్వారకనాథరెడ్డి నాయకత్వాన్ని తామంతా బలపరచి, వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు ఎం.వెంకట్రమణ, నారాయణరెడ్డి, రఘు, రామిరెడ్డి, పూసల రెడ్డెప్ప, కుమార్, వెంకటేష్, రమణ, శీన, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
నేడు జగన్ సమక్షంలో చేరికలు
బి.కొత్తకోట: పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సోమవారం వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. పీటీఎం ఎంపీపీ కొండా గీతమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్ధార్థలు గతవారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం సింగిల్విండో చైర్మన్ ఎం.భాస్కర్రెడ్డి, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వీరు రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వారు విశాఖపట్నం బయలుదేరారు.