బీద సోదరుల గ్రామంలో టీడీపీకి భారీ షాక్‌

21 Jul, 2018 09:13 IST|Sakshi
పార్టీలో చేరిన మత్స్యకారులతో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

సాక్షి, కావలి (నెల్లూరు): రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీలో సభ్యుడంటూ పోలీసుల పైలెట్‌ వాహనాన్ని తన వెంట తిప్పుకునే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్వగ్రామమైన అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. పంచాయతీలోని చంద్రబాబునగర్‌కు చెందిన 50 మత్స్యకార కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఇస్కపల్లిలో పార్టీ సీనియర్‌ నాయకుడు బీద రమేష్‌ బాబు యాదవ్‌ నివాసం వద్ద శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి  ప్రతి ఒక్కరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మత్స్యకారులు మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం మాటలతోనే మభ్యపెట్టి కాలం గడిపారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు.

ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల కోసం మంచి పథకాలను ప్రకటించారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని తమ గ్రామానికి రానీయకుండా అడ్డుకోవడం తమల్ని సమాజంలో వేలెత్తి చూపించేలా చేసిందన్నారు. మా గ్రామంలో ఎమ్మెల్యేనే రానీయమంటే, అందుకు ప్రతికారంగా ఇతర గ్రామాల ప్రజలు, ఇతర పట్టణాల ప్రజలు మా గ్రామానికి చెందిన వారిని రానీయమంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచిస్తేనే బాధగా ఉందన్నారు.

కొందరిని టీడీపీ నాయకులు పక్కదోవ పట్టించి మా గ్రామానికి ఇలాంటి చెడ్డ పేరు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలకు, గ్రామానికి మంచిది కాదని తామే వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కూడా కృషి చేస్తామన్నారు. వెనుకబడి ఉన్న మత్స్యకారులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదుకోవాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు దండా కృష్ణారెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నీలం సాయి కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు