మంత్రి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

25 Aug, 2019 14:57 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సీర్సీపీలోకి చేరారు. ఆదివారం నాటి చేరికల అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాత, కొత్త నాయకులు సమిష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదిన్నర వేల కోట్లతో విజ్జేశ్వరం నుంచి డెల్టా ప్రాంతంలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

కాగా కౌలు రైతులకు కూడా రాబోయే రోజుల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి రైతు భరోసా కల్పిస్తామని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు చిత్తశుద్ధిగా కృషి చేసి విజయకేతనం ఎగురవేయాలని వ్యాఖ్యానించారు. కళాకారులకు ప్రత్యేక ఫించన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ పివిఎల్‌ నరసింహరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్ రాజు, మంతెన యోగేంద్ర బాబు, మంతెన సుబ్రమణ్యం రాజు, మంతెన రంగరాజు, మేడిద జాన్సన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు