చేతివాటం!

4 Feb, 2019 13:35 IST|Sakshi
అల్లూరు గ్రామసభలో సొమ్మసిల్లిన మహిళను తీసుకొస్తున్న యువకులు

చెక్కుల పంపిణీలో తమ్ముళ్లకు మామూళ్లు

మొదటి విడత చెక్‌ డ్రా చేయగానే అధికారులకు రూ.వెయ్యి

సామాజిక పింఛన్ల పంపిణీలో కూడా వసూలు

అధికారపార్టీ ప్రచార సభలుగా గ్రామసభలు

భోజనం లేక ఆకలితో అలమటించిన లబ్ధిదారులు

ఎన్నికల తాయిలాల్లో భాగంగా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక పింఛన్ల పెంపు, పసుపు–కుంకుమ 2 చెక్కుల పంపిణీలో తెలుగుతమ్ముళ్లు సందట్లో సడేమియాలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మంజూరుకో రేటు పెట్టి వెలుగు సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు వసూలు చేస్తున్నారు. మూడు రోజుల పండగ అంటూ ఆర్భాటంగా నిర్వహిస్తున్న గ్రామసభలు అసౌకర్యాల నడుమ మండుటెండలోనిరీక్షణలతో మహిళలు ఇబ్బందిపడుతున్నారు.

సాక్షి, నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రామసభలను టీడీపీ నేతల ప్రచార సభలుగా మార్చేసుకుని ఊకదంపుడు ఉపన్యాసాలతో లబ్ధిదారులకు విసుగుపుట్టించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పసుపు–కుంకుమ 2, సామాజిక పింఛన్ల పెంపు నగదు పంపిణీ గ్రామసభల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. పసుపు–కుంకుమ చెక్కులు, పింఛన్ల నగదు ఇవ్వాలంటే తప్పక గ్రామసభలకు హాజరుకావాలంటూ లబ్ధిదారులను పిలిపించి కూర్చోబెట్టి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని సైతం టీడీపీ ప్రచారసభలుగా మార్చుకుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పంపిణీ అంటూ ప్రచారం చేసుకోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. మండుటెండలో కూర్చొనేందుకు కుర్చీలు లేక తాగేందుకునీరు కూడా లేకపోవడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామసభలనిర్వహణకు రూ.6 వేలు మాత్రమే సెర్ఫ్‌ నిధులు ఇచ్చినా అవి చేతికి అందకపోవడంతో గ్రామకార్యదర్శులు అప్పులు చేసి సభల నిర్వహిస్తున్నా రు. స్వీటుపేరుతో లబ్ధిదారునికి రూ.15 వంతు న ఇచ్చినా సక్రమంగా పంపిణీ చేయటం లేదు. చెక్కుల పంపిణీకి నేతల కోసం నిరీక్షిస్తూ సాయంత్రం వరకు ఉంచినా లబ్ధిదారులకు భోజన  సౌకర్యం కల్పించపోవడంతో ఆకలితో అలమిటిస్తున్నారు.

చిలక్కొట్టుడు
జిల్లాలోని పలుచోట్ల తెలుగుతమ్ముళ్లు, వెలుగు అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. బుచ్చి రెడ్డిపాళెం మండలంలోని సామాజిక పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి రూ.100 వంతు న వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.  కలిగిరి మండంలోని పసుపు–కుంకుమ చెక్కులు పంపిణీకి రూ.వెయ్యి వంతున వెలుగు సిబ్బంది, అ«ధికారపార్టీ నేతలు వసూలు చేసినట్లు ఆరోపణలు న్నాయి.

స్త్రీనిధి చెల్లింపులు లేవని చెక్‌ల నిలిపివేత
బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేదని, స్త్రీనిధిరుణాలు సక్రమంగా కట్టలేదని పసుపు–కుంకుమ చెక్కులు నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. ఆత్మకూరు మండలం నలపరెడ్డిపల్లెలో గౌరీ గ్రూపునకు పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీని నిలిపివేశారు. అలాగే సుమారు 50 గ్రూపుల వరకు ఇలాంటి సాకులు చూపి చెక్కుల పంపిణీని నిలిపివేశారు.
విడవలూరు మండలంలో జరిగిన గ్రామసభల్లో అధికారులు కాకుండా స్థానిక టీడీపీ నేతలే  చెక్కులు పంపిణీ చేయడంపై వివాదంగా మారింది.
అల్లూరులో నిర్వహించిన గ్రామసభలో జరిగిన తోపులాటలో మహిళ సొమ్మిసిల్లపడిపోయింది.
వెంకటాచలంలో పాతగ్రూపులకే చెక్కుల పంపిణీ చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు