సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీ నేతలది

16 Jun, 2019 10:14 IST|Sakshi
శ్మశాన వాటికపై రాయించిన టీడీపీ నాయకులు పేర్లు

సాక్షి, అనకర్లపూడి (ప్రకాశం): మండలంలోని అనకర్లపూడిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలకు టీడీపీ నాయకులు తమ పేర్లను దర్జాగా వేసుకున్నారు. గ్రామ టీడీపీ నాయకుడు చెప్పినట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సైతం తలూపారు. రూ.లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశానాలకు, భవనాలకు సొంత పేర్లు పెట్టుకోవడం సరికాదని అధికారులు చెప్పకపోగా ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళితే.. అనకర్లపూడిలో రూ.10 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌శాఖ అధికారులు శివాలయం ఎదురుగా హిందూ శ్మశాన వాటికను రెండేళ్ల క్రితం నిర్మించారు. అదే విధంగా మరో రూ.5 లక్షలకు పైగా నిధులతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు.

రెండు నిర్మాణాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చేయించాడు. సదరు టీడీపి నాయకుడు స్వామిభక్తి చాటుకోవటానికి ఎమ్మెల్యే వద్ద తన పేరు ఘనంగా ఉండటానికి ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరును కూడా రాయించుకున్నాడు. అదే విధంగా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనానికి సైతం ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరు వేయించుకున్నాడు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలపై టీడీపీ నాయకులు పేర్లు వేయించుకోవడంపై గ్రామస్తులు పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశాన స్థలం ప్రహరీపై టీడీపీ నాయకుల పేర్లు తీసేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు