టీడీపీ నేతల వేధింపులపై వితంతువు ఫిర్యాదు

11 Nov, 2014 00:40 IST|Sakshi
టీడీపీ నేతల వేధింపులపై వితంతువు ఫిర్యాదు

చిత్రం (గుడ్లవల్లేరు) : రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తనకు ఇష్టమైన నాయకుడికి వేసినందుకు గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో బొప్పా రమాదేవి అనే వితంతువును టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితురాలు సోమవారం కలెక్టర్, డీపీవోకు సోమవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేశాననే తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం నుంచే తననరు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన భర్త మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. పంచాయతీ పోరంబోకు ఇంటి స్థలం సెంటున్నర తమ కుటుంబానికి మిగిలిందని తెలిపారు.

గ్రామంలోనే వేరే ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలానికి చెందిన కరెంట్ బిల్లు, ఇంటిపన్ను రశీదును అడ్డం పెట్టి తన స్థలాన్ని చేజిక్కించుకునేందుకు తెగబడుతున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇదే ఇంటికి సర్పంచ్ లెటర్‌ను కూడా ఇచ్చారని చెప్పారు. తన స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేత ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఇంటి స్థలాన్ని తనకు అప్పగించాలని ఆమె కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు