త్వరలోనే ఎమ్మెల్యే బీవీ చిట్టా విప్పుతా

8 May, 2018 08:31 IST|Sakshi

కర్నూలు(అర్బన్‌):  రాజకీయ కుట్రలో భాగంగానే  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తనను అరెస్ట్‌ చేయించి జైలుకు పంపించారని, త్వరలోనే ఆయన చిట్టా విప్పుతానని గోనెగండ్ల మాజీ సర్పంచ్‌ టి. నాగేష్‌నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గోనెగండ్ల సొసైటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇప్పటికీ రూ.40 లక్షల అవినీతికి సంబంధించి ఆదోని న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయన్నారు. 

రాజకీయంగా ఎదుగుతున్న వాల్మీకులను అణగదొక్కేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 65 వేల మంది వాల్మీకుల ఓట్లు ఉన్నాయని.. ఎన్నికల్లో తమ సత్తా చూపించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, నాయకులు బోయ గోపీ, వీవీ నాయుడు, శివ, గోనెగండ్ల నాయకులు రంగస్వామి, మురళీనాయుడు, గుడికల్లు రంగన్న, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు