ఆద్యంతం..పచ్చందారీతనమే..

30 Aug, 2017 01:47 IST|Sakshi
ఆద్యంతం..పచ్చందారీతనమే..

కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ చివరి వరకు అధికార పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేసింది. అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతలు దాదాగిరీ ప్రదర్శించారు. ప్రత్యర్థులను బెదిరించారు. ‘నీ సంగతి చూస్తానంటూ’ ఒకరు, ‘డబ్బు పంపిణీని అడ్డుకుంటారా’ అని మరికొందరు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌లో ప్రచారమేంటని అడిగినందుకు మరికొందరు రౌడీయిజానికి దిగారు. టీడీపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు (కొండబాబు) తన సహజ శైలిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిపై అంతెత్తున లేచారు. మొత్తానికి టీడీపీ నేతల దౌర్జన్యాల మధ్య కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అధికార పార్టీ ఆగడాలను పోలీసులు అడ్డుకోలేకపోయారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆద్యంతం ‘పచ్చ’ం దారీతనమే పెత్తనం చెలాయించింది. పోలింగ్‌ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు చెలరేగి పోయారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ప్రచారం చేయడమే కాక అడ్డొచ్చిన ప్రతిపక్ష నాయకులపై దాదాగిరీ ప్రదర్శిం చారు. ‘నాలుగైతే నీగతి చూస్తా’నంటూ 14వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంకాడి సత్తిబాబును హెచ్చరించారు. ఇక్కడొకచోటే కాదు ఆయన వెళ్లిన ప్రతి చోటా వివాదమే. 32, 33 డివిజన్‌ల్లో సిటీ ఎమ్మెల్యే öండబాబు దూకుడుతో   మంగళవారం సాయంత్రం రామకృష్ణారావుపేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత 33వ డివిజన్‌లో టీడీపి అభ్యర్థి వర్గీయులు, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల మధ్య పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల విషయంపై వివాదం జరగ్గా ఎమ్మెల్యే కొండబాబు అక్కడకు చేరుకుని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై బెదిరించే ధోరణిలో మాట్లాడారు.

వనమాడి వెర్సెస్‌ ద్వారంపూడి
ఎమ్మెల్యే కొండబాబుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్పార్‌ సీపీæ సిటీ కోఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి దీటుగా బదులిచ్చారు. ఆయన ఇరువర్గీయులను సముదాయిస్తుండగా ఎమ్మెల్యే కొండబాబు 33వ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళారు. దీంతో ద్వారంపూడి బూత్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిçస్తుండగా పోలీసులు కుదరదంటూ  అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కోడ్‌ ఉల్లంఘించి లోపలకి వెళ్లొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు ఎమ్మెల్యేను వెనక్కి రప్పించారు. దీంతో వెనుదిరిగిన ఆయన అక్కసుతో 32వ డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌కు వెళ్ళారు.

 ఇక్కడ బూత్‌ లోపలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్త సైదులును ఎమ్మెల్యే కొండబాబు పోలీసుల సమక్షంలోనే  కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ద్వారంపూడి మళ్ళీ అక్కడకు వచ్చేలోగానే ఎమ్మెల్యే కొండబాబు జారుకున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగడంతో డీఐజీ రామకృష్ణ, ఎస్పీ విశాల్‌ గున్ని, డీఎస్పీలు సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ద్వారంపూడి విలేకరులతో మాట్లాడుతూ కోడ్‌ ఉల్లంఘించి ఎమ్మెల్యే చేసిన ఘాతుకంపై పోలీస్‌ ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

పోలీసులను నిలదీసిన ద్వారంపూడి
కార్పోరేషన్‌ పరిధిలోని 34వ వార్డు పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే కొండబాబు ప్రవేశించి ఓటర్లను ప్రలోభ పెట్టటంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే సుమారు పావుగంట సేపు పోలింగ్‌ కేంద్రంలోనే ఉండడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి వెంకటలక్ష్మి ఈ విషయాన్ని పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు వచ్చి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినట్లు తెలిపారు.

‘ఓటేయకుంటే పింఛన్లకు చేటు..’
37వ డివిజన్‌ ఫ్రేజర్‌పేట మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వృద్ధులు, వికలాంగులను తమ పార్టీకి ఓట్లు వే యాలని లేని పక్షంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుని పింఛన్లతో పాటు ప్రభుత్వ పథకాలు ఏమీ రాకుండా చేస్తామంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఒకానొక సమయంలో తెలుగుతమ్ముళ్లు  మంద బలాన్ని ఉపయోగించి పోలింగ్‌ కేంద్రం బయట ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలింగ్‌ బూత్‌లను  అడిషనల్‌ ఎస్పీ దామోదర్, సాయంత్రం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాలు సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు.

 వృద్ధులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన వాహనాలను టీడీపీ, బీజేపీ నేతలు పోలింగ్‌ బూత్‌ వరకూ తీసుకురావడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు యథేచ్ఛగా లోనికి ప్రవేశించగా వారిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నామమాత్రంగా బెదిరించారు తప్ప వారిని ఏమీ అనలేక పోయేవారు. అధికారంలో ఉన్నాం ఏమైనా చెయ్యగలమంటూ టీడీపీ నాయకులు అసభ్యపదజాలంతో వైఎస్సార్‌ సీపీ వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వారు ఎంత రెచ్చగొట్టినా పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలంటూ వారితో పాటు పోలీసులను సముదాయించడంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది.  

లేనేలేని డోర్‌ నంబర్లో 40ఓట్లు
43 డివిజన్‌లోని బాలయోగి వీధిలో  64–16–40 డోర్‌నెంబర్‌లో 40 ఓట్లు ఉన్నాయి. వాస్తవానికి అక్కడ ఆ డోర్‌ నెంబర్‌ లేనేలేదు. అధికారి పార్టీ అభ్యర్థి పక్కా ప్రణాళిక ప్రకారం ఆ డివిజన్‌లో స్థానికేతరులకు ఓట్లు నమోదు చేయించారు. ఎన్నికలు నిర్వహించే ముందు కార్పొరేషన్‌ అధికారులు ఓటరు లిస్ట్‌ అభ్యంతరాలు తీసుకొనే సమయంలో ఈ డోర్‌ నెంబర్‌లో ఓట్లు లేవు. ఎన్నికలకు సిద్ధమైన తర్వాత అభ్యర్థులకు ఇచ్చిన ఓటర్ల జాబితాకు అదనంగా 40 ఓట్లతో వేరే పేజీ జత చేశారు.

ఈ విషయాన్ని అక్కడ పోటీ చేసిన వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కోకా వెంకటగిరి, స్వతంత్ర అభ్యర్థి నమ్మి సత్యవాణి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికేతరులు ఓట్లు వేసేందుకు రావడంతో పోలింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. వారిది ఈ ప్రాంతమే కాదని ఓట్లు వేయనిచ్చేది లేదని పట్టుపట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఇరుపార్టీలకు చెందిన వారు గుంపులుగా పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకొనేందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్క డ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ రాజేష్‌  ఎస్పీ విశాల్‌గున్నికి పరిస్థితిని ఫోన్‌లో  వివరించడంతో వెంటనే మొబైల్‌పార్టీ పోలీసులను పంపారు.

 టీడీపీ అభ్యర్థి జేడీ పవన్‌కుమార్‌ వారికి ఎందుకు ఓట్లు ఇవ్వరని పోలింగ్‌ సిబ్బందితో వాగ్వివా దానికి దిగారు. ఎన్నికల   జోనల్‌ అధికారి నారాయణమూర్తి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి, ఇరువర్గాల వాదనలు విన్నారు. వారికి ఓట్లు ఉండి, గుర్తింపు కార్డులు ఉంటే ఓటు వేయవద్దనే అధికారం తమకు లేదన్నారు. దీంతో వారు యథేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. 4వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ నేతలు ఆందోళన చేశారు.  

బూత్‌లో డబ్బుల పంపకంతో గలాటా
21వ డివిజన్‌లో 12.30 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలింగ్‌బూత్‌లో నిలబడి  ఓటర్లకు  డబ్బులు పంపిణీ చేయడాన్ని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పసిగట్టి గొడవ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని  ఇరువర్గాల వారిని చెదరకొట్టేందుకు లాఠీచార్జ్‌ చేశారు. అధికార పార్టీ పోలీసు వర్గాల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయించడంపై ఇతరపార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్లిపోయాడు. 4.30 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి భర్త పోలింగ్‌బూత్‌లోకి మోటార్‌సైకిల్‌పై రావడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి పంపించి వేశారు.

14వ డివిజన్‌లో ఏటిమొగ అమృతసదన్‌ పాఠశాలలో టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్, కార్యకర్తలతో వచ్చి పోలింగ్‌బూత్‌ వద్ద ప్రచారం టీడీపీకి ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతుండడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ వచ్చి టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోలీసులు కూడా అధికారపార్టీ నాయకులకు మద్దతు పలికారు. ఎస్పీ విశాల్‌ గున్ని, ఉత్తరకోస్తా ఐజీ విశ్వజిత్‌ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.
 
పోలీసుల పక్షపాత వైఖరి..

38వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మాకినీడి శేషుకుమారికి సహకరిస్తున్న కానిస్టేబుల్‌ను వదిలిపెట్టి, వైఎస్సార్‌సీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ఎస్సైని ఆ పోలింగ్‌ కేంద్రం విధుల నుంచి  తొలగించడం విశేషం. ఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరుపార్టీల నాయకులు వంద మీటర్లలోపులో ఉండరాదని ఎస్సై హెచ్చరించారు. ఈ చర్యలను జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎస్సై వైఎస్సార్‌  సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎస్పీ గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ విధుల్లో ఉన ఎస్సైని బయటికి పంపారు. అయితే పోలింగ్‌ ప్రారంభం నుంచి టీడీపీ నాయకులకు సహకరిస్తున్న ఒక కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు దుయ్యబట్టారు. పోలీసులు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కండువాతో బీజేపీ నేత
39వ డివిజన్‌లో  బీజేపీ అభ్యర్థికి మద్దతుగా వచ్చిన ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు మెడలో పార్టీ కండువాను వేసుకోవడం వివాదస్పదమైంది. మెడలో కండువాను తొలగించాలని ఇండిపెండెంట్‌ అభ్యర్ధి అనుచరులు డిమాండ్‌ చేశారు. అయితే తాను 200 మీటర్ల దూరంలో ఉన్నానని తాను తీయాల్సిన పనిలేదని చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో అక్కడకు మీడియా చేరుకోవడంతో ఆయన జారుకున్నారు.

పచ్చచొక్కాలతో ప్రచారం
35వ డివిజన్‌ పోలింగ్‌ జరుగుతున్న  కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో గల పీఆర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పచ్చ చొక్కాలు వేసుకుని ఓటర్లను ప్రలోభ పెట్టారు. అది గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వారి ప్రచారాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ నాయకులను వారించారు. ఇదిలా ఉండగా ఈ వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న బలువూరి రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ కేంద్రంలోనే ఉండి ఓటర్లను ప్రలోభపెట్టినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.

పోలీసుల తీరుతో ఓటర్ల బేజారు
పోలింగ్‌ ప్రారంభంలో పోలీసులు అనుసరించిన తీరుతో ఓటర్లు బేజారెత్తారు. ముగ్గురు, నలుగురు కల్సి ఓటువేయడానికి వచ్చినా చెదరకొట్టే ప్రయత్నంచేశారు. టీడీపీ అభ్యర్థులు పోలింగ్‌ బూత్‌ వద్ద ఉన్నా పట్టించుకోని పోలీసులు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను 100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పడం కనిపించింది. గంట గడిచేసరికి అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వెనక్కి తగ్గారు.

చివరి నిమిషంలో రిగ్గింగ్‌ యత్నం
49వ డివిజన్‌లో టీడీపీకి చెందిన కొందరు చివరి నిమిషంలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు సిద్ధం కాగా, వైఎస్సార్‌ సీపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వెళ్లారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా వారు బయటకు వచ్చారు. అయితే అప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్‌ సమయం ముగిసిందని ప్రకటించారు. 16, 17, 18 డివిజన్లలో పోలింగ్‌బూత్‌ల వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నిలబడి ఓటర్లను ఓట్లు అభ్యర్థించే విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు