బారికేడ్స్‌ను తొలగించి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

10 Oct, 2019 09:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పట్టణంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్‌ కుమార్‌లు గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించవ్దదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ర్యాలీకి అనుమతులేందుకంటూ పోలీసులపై దాడి చేశారు. జంక్షన్ వద్ద ఉన్న బారికేడ్స్‌ను తోసేసి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించడంతో నగర పౌరులు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతూ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్‌ చేయడంతో రద్దీ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు వారించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు