ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

7 Apr, 2018 08:35 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (ఫైల్‌ ఫోటో)

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సొంతపార్టీ ఎమ్మెల్యేలు

రైతుకు రెట్టింపు ఆదాయం ఎలా? 

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ప్రశ్న

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకు గోడౌన్లు లేకపోతే ఇక రైతుకు ఎక్కడ నుంచి రెట్టింపు ఆదాయమొస్తుందో అర్థం కావడట్లేదన్నారు.

గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ.. పంట రుణం తీసుకునేందుకు బీమా కట్టించుకుంటున్నారు, కానీ పంట దెబ్బతింటే మాత్రం రావట్లేదని, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామారావు మాట్లాడుతూ.. తెల్లసెనగలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నారు. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమాధానమిస్తూ.. దీనిపై వ్యవసాయ వర్శిటీ వీసీ ఆధ్వర్యంలో కమిటీని వేశామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లకు ఇచ్చే రూ.1.50 లక్షలు సరిపోవట్లేదని, ప్రభుత్వమే ఇళ్లను కట్టించి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు.

మరిన్ని వార్తలు