తెల్లబోయే దోపిడీ

19 Jan, 2020 04:16 IST|Sakshi

బినామీల వెనుక పచ్చ గద్దలపై గురి!

రాజధాని ముసుగులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తోపాటు మనీ ల్యాండరింగ్‌

797 మంది తెల్లరేషన్‌ కార్డుదారుల ద్వారా భారీగా భూములు కొన్న టీడీపీ పెద్దలు

నిరుపేదలు రూ.కోట్లు వెచ్చించి భూములు కొనటంపై సీఐడీ దర్యాప్తు

వారికి కనీసం పాన్‌ కార్డులు లేవు.. ఆదాయపు పన్నూ చెల్లించ లేదు

బడాబాబుల తరఫున భూములు కొన్న తెల్లరేషన్‌కార్డుదారులకు నోటీసులు 

సెక్షన్‌ 409, 420, 403, 406, 418 కింద కేసులు నమోదుకు సీఐడీ సిద్ధం

అక్రమార్కులపై చర్యల కోసం ఆదాయపు పన్ను శాఖకు వినతి

కేసు వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కూ పంపాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతిని ప్రకటించటానికి ముందే టీడీపీ నేతలు 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల ద్వారా భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో గుర్తించింది. పొట్ట గడవటమే కష్టమైన కొందరు నిరుపేదలు రూ.కోట్లు వెచ్చించి ఖరీదైన భూములను కొనుగోలు చేయడం విస్తుగొల్పుతోంది. వీరి వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 30 వరకు ఈ భూ దందాలు జరిగాయి. సీఐడీ అధికారులు వారి ఆధార్‌ నంబర్లను ఆదాయపు పన్ను శాఖకు అందచేసి పాన్‌కార్డులు, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై ఆరా తీస్తున్నారు. ఐటీ శాఖ ఇప్పటిదాకా వీరిలో 477 మంది వివరాలను పరిశీలించగా 157 మంది పాన్‌ కార్డులు కలిగి ఉన్నట్లు సీఐడీకి నివేదిక ఇచ్చింది. అయితే వీరిలో ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించలేదని వెల్లడైంది. మిగతా 320 మంది వివరాలను ఆదాయపు పన్ను శాఖ విశ్లేషిస్తోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో అమరావతిలో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, అనుచరులను ముందు పెట్టిన చంద్రబాబు బృందం భారీగా భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఎన్నో సాక్ష్యాలు..
- గుంటూరు జిల్లా పొన్నూరులోని చింతలపూడి ఇంటి నెంబర్‌ 4–83లో నివాసం ఉండే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి (ఆధార్‌ నెంబర్‌ 465580884906) వయసు 26 ఏళ్లు. మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయినా ఆమె తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 074800500478) లబ్ధిదారురాలే. వీరవైష్ణవి తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్‌ 69/2లో మూడు ఎకరాల భూమిని 2014 అక్టోబర్‌ 13న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్‌ ధర ఎకరం రూ.2 కోట్లు పలుకుతోంది. వీర వైష్ణవి తెల్లకార్డు కలిగి ఉండటం ఓ విశేషం కాగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి మూడు ఎకరాలు కొనుగోలు చేయడం మరో విశేషం. అంటే ఆ ముసుగులో దాగిన పచ్చగద్ద ధూళిపాళ్ల నరేంద్రకుమారే అన్నది స్పష్టమవుతోంది. నరేంద్ర మాజీ ఎమ్మెల్యే అయి ఉండీ కుమార్తెకు తెల్లరేషన్‌కార్డు మంజూరు చేయించుకోవడంపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది.  

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఇంటి నెంబర్‌ 3–108లో నివసించే పిన్నిబోయిన రామారావు (ఆధార్‌ నెంబర్‌ 206532486739) వయసు 81 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 071204102522) లబ్ధిదారుడైన ఆయన 20 ఏళ్ల వయసు నుంచి ఏటా రూ.ఐదు వేల చొప్పున ఆదా చేసినా 2014 జూన్‌ నాటికి రూ.3.05 లక్షలకు మించదు. పోనీ ఏడాదికి రూ.పదివేల చొప్పున ఆదా చేసినా రూ.6.10 లక్షలకు మించదు. పిన్నబోయిన రామారావు 2014 జూన్‌ 6న తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్‌ 26లో ఎకరం రూ.7.68 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున మూడు ఎకరాలను రూ.23.04 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కానీ  అక్కడ మార్కెట్‌ రేటు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతోంది. అంటే  రూ.4.50 కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం తీసుకున్నా ఆయన ఏడాదికి రూ.పది వేల చొప్పున గరిష్టంగా ఆదా చేయగలిగే రూ. 6.10 లక్షలు ఎక్కడ? భూమి కొనుగోలు చేయడానికి వెచ్చించిన రూ.23.04 లక్షలు ఎక్కడ? ఈ నిరుపేద ఏ బడా‘బాబు’ బినామీనో తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది.

గుంటూరు జిల్లా మంగళగిరి చెరువుకట్ట సమీపంలో ఇంటి నెంబర్‌ 7–9లో నివాసం ఉండే పెనుమళ్లి శ్రీనివాసరావు (ఆధార్‌ నెంబర్‌ 459984228049) వయసు 52 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0712049ఏ0213) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం పెదపరిమిలో సర్వే నెంబరు 202/2ఏ1లో ఎకరం రూ.11.34 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.45.36 లక్షలు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 జూన్‌ 6న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్‌ ధర ఎకరం రూ.1.50 కోట్లకుపైగా ఉంది. అంటే రూ.ఆరు కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.20 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన శ్రీనివాసరావుకు అంత డబ్బు వెచ్చించి భూమి కొనే శక్తి ఉంటుందా? ఉండనే ఉండదు. శ్రీనివాసరావు వెనుక దాగిన పచ్చగద్దను గుర్తించే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది.

- విజయవాడలోని ఫన్‌టైమ్‌ క్లబ్‌ రోడ్డులో ఇంటి నెంబర్‌ 59ఏ–8–6లో నివాసం ఉండే అన్నే వీరభోగవసంతరావు (ఆధార్‌ నెంబర్‌ 998504554110) వయసు 58 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 068427000095) లబ్ధిదారుడైన ఆయన తాడేపల్లి మండలం ఇప్పటంలో సర్వే నెంబర్‌ 163/బీలో ఎకరం రూ.55.70 లక్షల చొప్పున ఆరు ఎకరాలకు రూ.3.35 కోట్లు వెచ్చించి 2014 అక్టోబర్‌ 18న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం అక్కడ ఎకరం విలువ రూ.పది కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.80 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడు వీరభోగవసంతరావు రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనగలడా? ఈ మాయను చేధించేందుకు సీఐడీ సిద్ధమైంది. 

- విజయవాడ రామచంద్రరావు వీధిలో ఇంటి నెంబర్‌ 57–12–10లో నివాసం ఉండే జువ్వా అంజలీదేవి (ఆధార్‌ నెంబర్‌ 859261831867) వయసు 60 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ061605610058) లబ్ధిదారైన అంజలీదేవి తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్‌ 5/2లో ఎకరం రూ.10.50 లక్షల చొప్పున నాలుగు ఎకరాలను రూ.42 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. మార్కెట్‌ ధర అక్కడ ఎకరం రూ.రెండు కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.నాలుగు లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారైన అంజలీదేవి రూ.కోట్లు కుమ్మరించి భూములు కొనగలరా? ఆమె వెనుక ఉన్న పచ్చగద్ద ఎవరన్నది సీఐడీ అన్వేషిస్తోంది. 

గుంటూరు కొరిటెపాడులో ఇంటి నెంబర్‌ 67–4–177లో నివసించే గొల్లపూడి శారద (ఆధార్‌ నెంబర్‌ 674763182727) వయసు 55 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్లూఏపీ0731022ఏ0458) కలిగిన శారద అమరావతి మండలం నరుకుళ్లపాడు సర్వే నెంబరు 114/బీ, 114/ఏ, 113/బీ, 113/ఏలో ఎకరం రూ.7.53 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) మూడు ఎకరాలను రూ.22.59 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి 2014 ఆగస్టు 12న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్‌ విలువ ఎకరం రూ.2.50 కోట్లు ఉంది. అంటే ఆ భూమిని రూ.7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు ఆమె ఆమె గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.3.50 లక్షలకు మించదు. అలాంటప్పుడు ఆ భూమిని కొనగలిగే తాహతు ఆమెకు ఉంటుందా?  

- ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వారెడ్డిపాలెంలో నివాసం ఉండే కాకుమాని కోటేశ్వరరావు (ఆధార్‌ నెంబర్‌ 410227073379) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 084408360243) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం వెలగపూడి సర్వే నెంబర్‌ 181/బీలో ఎకరం రూ.16.76 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) నాలుగు ఎకరాలకు రూ.67.04 లక్షలు వెచ్చించి 2014 సెప్టెంబరు 16న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మార్కెట్‌ ధర అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. కానీ తెల్లకార్డుదారుడైన కోటేశ్వరావు అప్పటిదాకా గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.4.50 లక్షలకు మించదు. మరి ఆయనకు అంత డబ్బు పోసి భూములు కొనడం ఎలా సాధ్యమైంది? కోటేశ్వరరావు వెనుక ఉన్న బడాబాబును బయటకు రప్పించే దిశగా సీఐడీ చర్యలు చేపట్టింది. 

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం ఇంటి నెంబరు 1–132లో నివాసం ఉండే ముక్కపాటి పట్టాభిరామారావు (ఆధార్‌కార్డు నెంబర్‌ 287486854021) వయసు 71 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ 060607028ఏ0043) లబ్ధిదారుడైన ఆయన అమరావతి మండలం కర్లపూడి సర్వే నెంబర్‌ 23/2డీ, 23/2ఈ, 26/1, 27/2, 27/1లో ఎకరం రూ.12.04 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.36.12 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 సెప్టెంబరు 20న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్‌ రేటు ఎకరం రూ.1.50 కోట్లు ఉంది. ఈ లెక్కన ఆయన రూ.4.50 కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. తెల్లకార్డున్న పట్టాభిరామారావు అప్పటిదాకా ఆదా చేయగలిగే మొత్తం గరిష్టంగా రూ.5.10 లక్షలకు మించదు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వైఎస్సార్‌ సెంటర్‌ ఇంటి నెంబర్‌ 1–37లో నివాసం ఉండే మేకా వెంకటరెడ్డి (ఆధార్‌ కార్డు నెంబర్‌ 934736078913) వయసు 67 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ071100200217) లబ్ధిదారుడైన ఆయన పెదకాకాని మండలం అనుమర్లపూడి సర్వే నెంబర్‌ 15/3, 15/4, 15/6, 15/7, 15/8లో ఎకరం రూ.29.35 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.47 కోట్లు వెచ్చించి ఐదు ఎకరాలను 2014 సెప్టెంబరు 29న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్‌ ధర ఎకరం రూ.రెండు కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.పది కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. అప్పటివరకు గరిష్టంగా రూ.4.70 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన వెంకటరెడ్డిని బినామీగా చేసుకున్న పచ్చగద్దను తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది. 

గుంటూరు జిల్లా నాదెండ్లలో పటమటబజార్‌ ఇంటి నెంబర్‌ 6–70లో నివాసం ఉండే నెల్లూరి మంగమ్మ (ఆధార్‌  నెంబర్‌ 782400477863) వయసు 61 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ073801000059) లబ్ధిదారైన ఆమె తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నెంబర్‌ 357/బీ1ఏలో ఎకరం రూ.33.60 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.35 కోట్లు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 నవంబర్‌ 10న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. అప్పటిదాకా గరిష్టంగా రూ.4.10 లక్షలు మాత్రమే ఆదా చేసే అవకాశం ఉన్న మంగమ్మకు రూ.కోట్లు వెచ్చించే శక్తి ఎలా ఉంటుంది? 

- గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేట ఇంటి నెంబర్‌ 11–12–12లో నివాసం ఉండే రావెల సత్యనారాయణ (ఆధార్‌ నెంబర్‌ 667104733878) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0784024ఏ0122) కలిగిన సత్యనారాయణ అమరావతి మండలం అమరావతిలో సర్వే నెంబర్‌ 185/బీ, 185/సీ, 185/డీలో ఎకరం రూ.11.90 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.35.7 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 డిసెంబర్‌ 31న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మార్కెట్‌ విలువ అక్కడ ఎకరం రూ.మూడు కోట్లు ఉంది. ఎంత కష్టపడ్డా అప్పటిదాకా రూ.4.50 లక్షలకు మించి ఆదా చేసే అవకాశాల్లేని రావెల సత్యనారాయణకు రూ.కోట్లు కుమ్మరించే శక్తి ఎలా వచ్చింది? 

భూములు కొన్న తెల్లకార్డుదారులకు నోటీసులు..
రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన 797 మంది తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు సీఐడీ నోటీసులు జారీ చేస్తోంది. ‘మీ ఆదాయ వనరులు ఏమిటి? ఎంత ఆదా చేశారు? ఆదా చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించారా? ఎలాంటి ఆదాయం లేకుండా రూ.కోట్లు వెచ్చించి భూములు ఎలా కొనుగోలు చేయగలిగారు? మీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం వెనుక ఉన్నదెవరు?’ అనే అంశాలపై నిగ్గు తేల్చనుంది. పచ్చగద్దల పేర్లను వెల్లడించని వారిపై ఐపీసీ సెక్షన్‌ 420, 418, 406 కింద కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. బడాబాబులను గుర్తించి ఐపీసీ 409, 420, 418, 406, 403 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపుపన్ను శాఖకు వివరాలు పంపి చర్యలు తీసుకోవాలని కోరతామని సీఐడీ అధికారులు వెల్లడించారు.

తెల్ల రేషన్‌కార్డు ఎవరికంటే?
ఏడాదికి రూ.60 వేల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే తెల్లరేషన్‌ కార్డుకు అర్హులు. దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న నిరుపేదలకే తెల్ల రేషన్‌కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి నిరుపేదలు ఏడాదికి ఎంత ఆదా చేసే అవకాశం ఉంటుంది? రాబడిలో ఖర్చులు పోనూ వారు ఏటా రూ.ఐదు వేలకు మించి ఆదా చేసే పరిస్థితి ఉండదు. 20 ఏళ్లలో రూ.లక్షకు మించి ఆదా చేయలేరు. ఏటా సగటున రూ.పది వేల చొప్పున ఆదా చేసినా 20 ఏళ్లలో రూ.రెండు లక్షలను మాత్రమే ఆదా చేయగలరు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో మనీల్యాండరింగ్‌..
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తోపాటు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులను ముందు పెట్టి నల్లధనం వెదజల్లి వారి పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు తేల్చింది. ఇందులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి ఆధారాలు పంపేందుకు సీఐడీ సిద్దమైంది. భూములు కొన్న 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులతోపాటు వారి వెనుక దాగిన చంద్రబాబు బృందాన్ని బయటకు రప్పించే పనులను సీఐడీకి సమాంతరంగా ఈడీ కూడా చేపట్టనుంది.

బినామీలను నమ్మని బడాబాబులు..
బినామీలను ముందు పెట్టి అమరావతిలో తక్కువ ధరలకే భూములను కాజేసిన బడాబాబులు రిజిస్ట్రేషన్‌ ముగిశాక జాగ్రత్త పడ్డారు. అధికారికంగా రాజధాని ప్రకటన వెలువడ్డాక భూముల ధరలు అమాంతం పెరిగితే బినామీలు ఎదురుతిరిగే అవకాశం ఉందని గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ ముగిశాక ఆ భూములతో తమకు సంబంధం లేదని బినామీలతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు.  

మరిన్ని వార్తలు