ఆరు నెలలకోసారి నిద్ర లేస్తారా?

8 Jul, 2015 01:33 IST|Sakshi

పవన్‌కల్యాణ్‌పై ఎంపీలు కేశినేని, కొనకళ్ల ఆగ్రహం

విజయవాడ: పవన్ కల్యాణ్ ఆరు నెలలకోసారి నిద్రలేచి.. జూలు విదిల్చి ఏదో ఒకటి మాట్లాడి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్లిపోతారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) విమర్శించారు. ‘తిడితే కేసీఆర్‌లా తిట్టాలి. పడితే ఆంధ్రా ఎంపీల్లాగా పడాలి..’ అంటూ పవన్ చేసిన ఆరోపణలపై నానితో పాటు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు తీవ్రంగా స్పందించారు.

సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టుపెడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు పౌరుషం చచ్చిలేరని, తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్ కేసీఆర్‌ను కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మెప్పు కోసమే హైదరాబాద్‌లో సెక్షన్-8 అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు.
 
 

మరిన్ని వార్తలు