'చిరంజీవిని మర్చిపోయావా పవన్'

7 Jul, 2015 11:36 IST|Sakshi
'చిరంజీవిని మర్చిపోయావా పవన్'

హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ఎంపీలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారని పవన్ చులకనగా మాట్లాడటంపై వారు అసంతృప్తి చెందుతున్నారు. దాంతో టీడీపీ ఎంపీలు...పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన పవన్ విమర్శిస్తే సహించేది లేదనే అభిప్రాయంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.  

రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారన్న విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకుంటే బాగుండేదని టీడీపీ ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది.  పవన్ తన వైఖరిని మార్చుకుంటే మంచిదని, వ్యాపారాలు చేస్తున్నంత మాత్రాన రాజకీయాల్లో ఉండకూడదా అని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

కాగా పవన్ కల్యాణ్ నిన్న ప్రెస్మీట్లో  సీమాంధ్ర ఎంపీలంతా ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే. ఎంపీలకు పౌరుషం లేదా అని, ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న ఎన్డీఏ చెప్పాయని, ఇప్పుడు ఆమాటే మర్చిపోయాయని విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీటు కోసం ఆ రోజు ఊగిపోయారని, ఎంపీ అయిన తర్వాత పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారా అని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు