టీడీపీ ఎంపీటీసీ తనయుడి దాడి

27 Feb, 2016 03:33 IST|Sakshi
టీడీపీ ఎంపీటీసీ తనయుడి దాడి

 తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు

చిలమత్తూరు: అధికార పార్టీ నాయకులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. అధికారం ఉందని విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా మండలంలోని కోడూరు పంచాయతీ మదిరేపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కుమారుడు గంగాధర్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం కోడూరు తోపులో టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు తనయుడు సోమశేఖర్ ఎందుకు నవ్వుతున్నారంటూ వారితో వాదనకు దిగాడు. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో సోమశేఖర్ పక్కనే ఉన్న ఇనుప రాడుతో గంగాధర్‌పై దాడి చేశాడు. దీంతో గంగాధర్ తలకు దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన బంధువులు గంగాధర్‌ను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాధితుణ్ని ఆసుప్రతికి పంపించారు. గతంలో కూడా దారి విషయంలో తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాడి విషయంలో బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయరాదని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు