సాక్షి, కృష్ణా : రాజకీయాలకు రాజ ధానిగా పేరున్న కృష్ణా జిల్లాలో ప్రజాస్వామ్యం చిన్నబోయే రీతిలో ఓట్ల కొనుగోలుకు అధికారపార్టీ సిద్ధమైంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లుగా ఏకంగా వేలం పద్ధతిన ఓట్లు కొనుగోలుకు తెగపడుతున్నారు. చివరకు ఒక్కో ఓటుకు రూ.3000 చొప్పున చెల్లించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.
ప్రత్యేక దళాల నిశిత పర్యవేక్షణలో టీడీపీ నాయకులు పంపిణీ కొనసాగిస్తున్నారు. పోలింగ్కు చివరి రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు రూ. కోట్లుకుమ్మరించారు. నియోజకవర్గంలోని ఓట్లలో 60 నుంచి 70 శాతం కొనుగోలు చేయాలనేది లక్ష్యంగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం.
వ్యూహాలు మార్చి డబ్బు పంపిణీ..
జిల్లా వ్యాప్తంగా పంపకాల పర్వానికి తెరలేపిన టీడీపీ అభ్యర్థులు మద్యాన్ని సైతం ఏరులై పారిస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓట్లను పెంచేలా టీడీపీ పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులతో ఒప్పందాలు చేసుకుని రూ. లక్షల్లో డబ్బు అందజేశారు. మాజీ పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ డబ్బును గ్రామీణ ప్రాంతాలకు చేర్చారు. డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు పట్టుబడితే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని బృందాలు ఏర్పడి రూ.49 వేల చొప్పున తీసుకెళ్లి ఓటర్లకు పంపిణీ చేయడం కనిపించింది. డబ్బు పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నా అడ్డుకోటానికి అధికారులకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.