టీడీపీ ప్రముఖులకు పరాభవం

24 May, 2019 14:58 IST|Sakshi

2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీకి చుక్కెదురైంది. 19 నియోజకవర్గాలకూ 14 వైఎస్సార్‌ సీపీ గెలవగా, నాలుగు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. ఒకేఒక సీటుతో జనసేన సరిపెట్టుకుంది. కీలక నేతల ఓటమి పాలవ్వడమే కాకుండా జిల్లాల్లో పెద్దన్నల పాత్ర పోషిస్తున్న ప్రముఖులకు సైతం కన్నులొట్టపోయింది. జిల్లాకు చెందిన ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు ఘోరంగా ఓడిపోయారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంకు చెందిన కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు కూడా ఓటమి పాలయ్యారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా పోటీ చేసిన పెద్దాపురం నియోజకవర్గంలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అతి కష్టంమీద గెలవగలిగారు. 


సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో అధికార పార్టీ దుర్నీతిని ప్రజలు తీవ్రంగా ఎండగట్టారు. ఐదేళ్ల దుష్ట పాలనకు చరమగీతం పాడారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కొత్తపేట, తుని నియోజకవర్గాల్లో అధికార పార్టీని ఓడించినది వైఎస్సార్‌ సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కావడం విశేషం. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్టుడు తుని నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇసుక, కొండలను సైతం మింగిన నేతలుగా యనమల సోదరులు పలు విమర్శనలను ఎదుర్కొన్నారు. అదే అభిప్రాయం నియోజకవర్గ ప్రజలు తమ ఓట్ల ద్వారా స్పష్టం చేశారు. యనమల రామకృష్ణుడు తన పంటి వైద్యానికి ప్రభుత్వ సొమ్ముని బిల్లుగా చెల్లించిన ఘటనతో పలు విమర్శలను ఎదుర్కొన్నారు. త్రిముఖ పోరు నెలకొన్న తుని నియోజకవర్గంలో సిట్టి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన సమీప ప్రత్యర్థి, మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు సోదరుడిపై 24 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. 


ఆర్‌ఎస్‌ నియోజకవర్గంలో...
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యానికి(ఆర్‌ఎస్‌) చెందిన కొత్తపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి బండారు సత్యానందరావు ఓటమి పాలయ్యారు. ఇసుక అక్రమాల్లో ఆరితేరిన నేతలుగా నియోకవర్గంలోని అధికార పార్టీ నేతలు పేరు గడించారు. వారిని నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఓడించారు. త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై గెలిచారు. 


పరువు నిలుపుకున్న రాజప్ప
ఇక డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో అతికష్టంపై గెలిచారు. ఆయన గెలుపు కోసం అన్ని ఆయుధాలను వినియోగించారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో స్టీల్‌ గిన్నెలను పంపిణీ చేయడం, డబ్బు పంపిణీ తదితర ప్రలోభాలతో ఆయన గెలుపు సాధ్యమైందని విశ్వేషకులు భావిస్తున్నారు.


తోటకు బ్రేక్‌ 
టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి, గెలవగల సత్తా ఉందని చెప్పుకునే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ఆ నియోజకవర్గ ప్రజలు ఓడించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ ఆయనపై విజయం సాధించారు. మరో మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కూడా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఇండిపెండెంట్‌గా గెలిచిన వర్మ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు