గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది

28 Jun, 2015 02:20 IST|Sakshi
గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది

తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు
* ఉమ్మడి రాజధాని, సెక్షన్-8పై గవర్నర్‌దే అధికారం
* కానీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు
* పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది
* ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు
* పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది
* టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు

 
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాలపై గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ  ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది? పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ  రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. ఉద్యోగుల భద్రత,  ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్‌ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.

విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.  ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామని, చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
నేతల గైర్హాజరు... బాబు అసంతృప్తి
విస్తృతస్థాయి సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు.
 
జర్నలిస్టులకు పెద్ద ఆసరా: సీఎం
రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలు ఉండే హెల్త్‌కార్డు జర్నలిస్టులకు పెద్ద ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. 14వేలమంది జర్నలిస్టుల్లో 8,321మందికి హెల్త్‌కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు.
 
మినీ సెక్రటేరియట్‌కు రూ.3 లక్షలు
ముఖ్యమంత్రి చంద్రబాబు  జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకుంటున్న భవనంలోనే ఓ భాగంలో (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది.

మంత్రివర్గ సమావేశం 3కి వాయిదా
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 3కు వాయిదా పడింది. తొలుత ఈ సమావేశా న్ని జూలై 2న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా
సాక్షి, విజయవాడ బ్యూరో: రంజాన్ సం దర్బంగా రాష్ట్రంలోని ముస్లింలకు చం ద్ర న్న రంజాన్ తోఫా ( కానుక)ను ఇస్తున్న ట్టు చంద్రబాబు ప్రకటిచారు. శనివా రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కార్యక్రమం లో సీఎం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కానుకలో రెండు కిలోల పంచదార, కిలో సేమియా, ఐదు కిలోల ఆటా (గోధుమ పిండి) పంపిణీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు