టీడీపీది క్షుద్ర రాజకీయం

5 Mar, 2019 07:19 IST|Sakshi
సబ్బవరంలో డీటీ వరహాలుకు ఫిర్యాదు చేస్తున్న అదీప్‌రాజ్‌

మా పార్టీ ఓట్లు మా నాయకులే తొలగిస్తారా?

ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతల అడ్డదారులు

ఓట్ల తొలగింపు దరఖాస్తులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

వైఎస్సార్‌ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

సబ్బవరం సీఐ, డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదులు

సబ్బవరం(పెందుర్తి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సానుభూతి ఓట్లు తొలగించే క్షుద్ర రాజకీయాలకు టీడీపీ తెరతీసిందని అ పార్టీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ధ్వజమెత్తారు. నియోజకవర్గం సబ్బవరం మండలంలో వైఎస్సార్‌ సీపీ నాయకుల పేరిట ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లే తొలగించాలని భారీ ఎత్తున దరఖాస్తులు రావడంపై అదీప్‌రాజ్‌ నేతృత్వంలో పార్టీ నాయకులు సోమవారం సబ్బవరం సీఐ ఎం.శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్‌ వరహాలుకు ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి కుట్రదారులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఓట్లు తొలగించి దొడ్డిదారిలో గెలవాలని టీడీపీ ఆలోచించడం సిగ్గుచేటన్నారు.

ప్రజల అభీష్టంతో నిజాయతీగా గెలవడం ఒక్క వైఎస్సార్‌ సీపీకే సాధ్యమన్నారు. టీడీపీవి మొదటి నుంచీ అడ్డదారి రాజకీయాలే అని ఎద్దేవా చేశారు. నీతిలేని రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో తొలి నుంచి ఆయనకు అండగా ఉన్న వారిని ఇలా వేధించి మానసిక క్షోభకు గురిచేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎవరైనా తమ పార్టీ ఓట్లు తామే తొలగించుకుంటారా అని ప్రశ్నించారు. మూడు నాలుగు రోజులుగా మండలంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను పట్టుకుని తగిన శిక్ష విధించాలని ఉన్నతాధికారులను కోరారు. ఎన్నికల సంఘం దీనిపై ప్రజలకు తగిన భరోసా ఇవ్వాలన్నారు. అదీప్‌రాజ్‌ వెంట పార్టీ నాయకులు కొటాన రాము, తుంపాల అప్పారావు, సబ్బవరపు ముత్యాలనాయుడు, వనం అచ్చింనాయుడు, పాలిశెట్టి సురేష్, బోకం రామునాయుడు, బోకం శ్రావణ్, వడ్డాది అప్పలరాజు, లగిశెట్టి కుమార్, కొటాన వెంకటరమణ, సత్యనారాయణరాజు, పెతకంశెట్టి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

రోజుకు 10 వేలకు పైనే దరఖాస్తులు
అర్బన్‌ ప్రాంతాల్లో అపార్టుమెంట్‌ పేరు, ప్రాంతం పేర్కొంటూ ఆ అపార్టుమెంట్‌లోని ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా ఓట్ల దొంగలు చొరబడ్డారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి 74,848 దరఖాస్తులందగా, గడిచిన రెండు రోజుల్లో ఈ సంఖ్య 90 వేల దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త ఓటర్ల నమోదు కోసం 2,03,169 దరఖాస్తులు, తొలగింపుల కోసం 64,240 దరఖాస్తులు అందాయి. కేవలం 24 గంటల వ్యవధిలో కొత్త ఓట్ల నమోదు కోసం 5,531 దరఖాస్తులు రాగా, తొలగింపుల కోసం ఏకంగా రెట్టింపు సంఖ్యలో 10,608 దరఖాస్తులందడం చూస్తుంటే ఏ స్థాయిలో తొలగింపుల కోసం వినతులు వెల్లువెత్తుతున్నాయో అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు