టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

5 May, 2016 02:26 IST|Sakshi
టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

తిరుపతి కల్చరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేని, చేతకాని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేసి, పదవుల నుంచి వైదొలగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు.  బుధవారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కృష్ణాపురం కూడలి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2014లో నరేంద్రమోదీ తిరుపతిలో జరిగిన బహిరంగసభలో నామాల వాని సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, నేడు రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 

మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే అబద్దాల వెంకయ్యనాయుడికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో  సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య,  బలరామ్, రామకృష్ణ, ఆనంద్, శ్రీధర్‌రావు, పి.మురళి, శ్రీరాములు, శివ, రత్నమ్మ, మునస్వామి, ఇబ్రహీంబాషా, చిన్నం కాళయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు మంజుల, లక్ష్మీదేవి, కవిత, లత, సుభాషిణి, జ్యోతి, వరలక్ష్మి, తనికాచలం, శేఖర్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు