‘కోడెలను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?’

6 Sep, 2019 20:08 IST|Sakshi

అంబటి రాంబాబు ప్రశ్న

పిడుగురాళ్లలో రేపు టీడీపీ బాధితుల సమావేశం

హాజరుకానున్న హోంమంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో టీడీపీ బాధితులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరితతో సహా పల్నాడు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రౌడీ షీటర్లను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగే విధంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు.

మాజీ స్పీకర్‌ కోడెల్ శివప్రసాద్‌కు గుండెపోటు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించలేదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను పరామర్శించలేని చంద్రబాబు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లిచ్చి ప్రజలు ఓట్లతో దాడి చేసినా చాల్లేదా? అని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్‌, యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై చంద్రబాబు నాయుడు నోరెందుకు మెదపడంలేదని ఎమ్మెల్యే కాసు మహేష్‌ ప్రశ్నించారు. తనపై దాడిచేయాలని చంద్రబాబు ప్రణాళిలకు రచించడం హాస్యాస్పదమన్నారు.
 

>
మరిన్ని వార్తలు