టీడీపీ విజయం.. ఓ నిశ్శబ్ధ విప్లవం

24 May, 2014 00:39 IST|Sakshi
టీడీపీ విజయం.. ఓ నిశ్శబ్ధ విప్లవం

- పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు
- నాయకులు, కార్యకర్తల పదేళ్ల కష్ట ఫలితమిది
- కేసీఆర్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు
- విలేకరులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి

కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవంతోనే తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో సోనియాగాంధీ, కేసీఆర్ కుమ్మక్కై సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే ప్రయత్నాలను తెలుగు ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదన్నారు. కేసీఆర్ ధోరణిలో ఏ మార్పు రాలేదని, ఆయన ఒక ఉన్మాదిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ వాఖ్యలు సీమాంధ్ర ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 పదేళ్ల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల రెక్కల కష్టమే టీడీపీ విజయమని స్పష్టం చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారన్నారు.  పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేసి టీడీపీ విజయానికి బాట వేశారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేస్తామని చెప్పారు. నవ్యాంధ్రను నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా నూతన రాష్ట్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, సిహెచ్ చిట్టిబాబు,షేక్ జానీమూన్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు