టీడీపీ మహిళా నేత దందా 

31 Aug, 2019 10:01 IST|Sakshi
పోలీసులు అదుపులోకి తీసుకున్న కంకర టిప్పర్‌

సీజ్‌ చేసిన క్వారీ నుంచి కంకర అక్రమ రవాణా

టిప్పర్‌ను పట్టుకున్న పోలీసులు 

సాక్షి, పెనుకొండ: టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్‌ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. క్వారీలోని కంకరను బయటకు తరలించకుండా ఆదేశాలు జారీ చేశారు.

అయితే నిబంధనలను ఉల్లంఘించి క్వారీ నిర్వాహకులు గత రెండు రోజులుగా 6 ఎంఎం కంకరను టిప్పర్‌లో బయటకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన కియా పోలీసులు టిప్పర్‌లో అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టిప్పర్‌ సహా డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే టిప్పర్‌పై దేవా వెంకటకొండయ్య పేరు ఉంది. ఇతను సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుకు స్వయానా తమ్ముడు. ఇతను చనిపోయాడు. కంకరను సవితమ్మే అక్రమంగా తరలిస్తుందనేందుకు ఇదే నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు