వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

25 May, 2014 00:30 IST|Sakshi
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

పొన్నూరు రూరల్, న్యూస్‌లైన్ :మండలంలోని మన్నవ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు రాడ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రేగులగడ్డ సత్యానందం, రేగులగడ్డ బాలరాజు, గొల్లా బాలశౌరిలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మన్నవ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీకి ఆధిక్యం రావడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రాష్ట్రం, నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చే సరికి అదును చూసి ఒక్కసారిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు.
 
  రేగులగడ్డ అంకారావు ఉదయాన్నే పొలం వెళ్లి వస్తుండగా దారిలో ఉన్న టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన రేగులగడ్డ సత్యానం దం, రేగులగడ్డ బాలరాజు, గొల్లా బాలశౌరిలను టీడీపీకి చెందిన  బండ్లమూడి బాబూరావు, బండ్లమూడి చింపిరయ్య, బండ్లమూడి అశోక్, బండ్లమూడి నాగమల్లేశ్వరరావు, బండ్లమూడి శ్రీనివాసరావు, బండ్లమూడి నల్లయ్య, బండ్లమూడి సురేష్, గొల్లా స్వామియేలు, అన్నవరపు చెంచునాయుడులు రాడ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేశారు. బాధితులను చికిత్సనిమిత్తం పొ న్నూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్రగాయాలైన బాధితులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు.
 

మరిన్ని వార్తలు