కాంగ్రెస్‌కు బ్రాంచీ ఆఫీసుగా టీడీపీ: గట్టు

20 Oct, 2013 20:23 IST|Sakshi
కాంగ్రెస్‌కు బ్రాంచీ ఆఫీసుగా టీడీపీ: గట్టు

హైదరాబాద్: అబద్ధాలను ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ బతుకీడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. టీడీపీ ప్రజల అభిమానం పొందలేక ఇతర పార్టీలపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆరితేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, రేవంత్ లాంటి  వారు నిత్యం అబద్ధాలను చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గట్టు రామచంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం కొనసాగడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. అవిశ్వాసం సందర్భంగా బాబు విప్‌జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి ప్రజల పాలిట గుదిబండలా తయారు చేశారన్నారు. ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు సహకరించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపై ఇప్పటి దాకా  చంద్రబాబు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు