చిత్తుగా తాగి...మూత్ర విసర్జన చేసి...

5 Sep, 2014 11:08 IST|Sakshi
చిత్తుగా తాగి...మూత్ర విసర్జన చేసి...

నల్గొండ :  ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు పవిత్ర వృత్తికి కళంకం తెచ్చాడు. పాఠశాలలో మూత్రం పోసి వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న హలీం తన స్నేహితులతో మద్యం తెప్పించుకుని పూటుగా తాగాడు. మైకం కమ్మడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థులపై చేయి చేసుకుని అడ్డుగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడిపై తిరగబడ్డాడు.

రిజిస్టర్లు చించి, సహచర టీచర్ల బైక్లలోని గాలి తీసి విచ్చలవిడిగా ప్రవర్తించాడు. మైకంలో కదలలేని స్థితిలో తరగతి గదిలోనే మూత్రం పోశాడు. గొడవ జరగటంతో గ్రామస్తులు వచ్చేలోపే ఆ ఉపాధ్యాయుడు పరారయ్యాడు. ఈ ఘటనపై డీఈవో విశ్వనాథం స్పందిస్తూ ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే ఈ సంఘటపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా హలీం గతంలో మద్యం సేవించి హల్చల్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు