మూగవేదన

29 Dec, 2013 04:11 IST|Sakshi

ఇది అట్లూరులోని పశువైద్యశాల. శనివారం పనిదినం  అయినప్పటికీ వైద్యశాలను మూసివేశారు.  పశువైద్యాధికారి శివప్రసాద్ ఉన్నత చదువుల నిమిత్తం దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు.  ఇదే మండలంలోని కమలకూరు వైద్యురాలు  కామాక్షమ్మ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. కమలకూరు ఆస్పత్రిలో డాక్టరు మినహా రెండో వ్యక్తి లేరు. గోపాలమిత్రల సహకారంతో బండిలాగిస్తున్నారు.  డాక్టర్, వెటర్నరీ అసిస్టెంటు ఇద్దరూ రాకపోవడంతో  శనివారం అట్లూరు వైద్యశాలను మూసేశారు. రెండు ఆస్పత్రులతో చుట్టపక్కల గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 సాక్షి, కడప: పశువైద్యశాలలలో సరైన సేవలు అందక జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 102 పశువైద్యశాలలు ఉన్నాయి. 90 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వైద్యశాలల్లో వనిపెంట డాక్టర్ మునెయ్య, అట్లూరు డాక్టర్  శివప్రపాద్ పీజీ కోర్సు చేసేందుకు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోయారు. సబ్‌సెంటర్లలో  82 ఖాళీలు ఉన్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు సరైన వైద్యసేవలు అందడం లేదు.
 
 సిబ్బంది సమస్యతో అందని వైద్యసేవలు
 జిల్లా వ్యాప్తంగా 1.38 లక్షల పాడిపశువులు ఉన్నాయి. 4.57లక్షల గేదెలు, 13.99లక్షల గొర్రెలు, 4.70లక్షల మేకలు ఉన్నాయి. ఇవి కాకుండా  11.53 లక్షల కోళ్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఏదోఒక రోగం రావడం, రైతులు వాటిని పశువైద్యశాలలకు తీసుకెళ్లడం నిత్యకృత్యం. అయితే సిబ్బంది సమస్యతో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీనికి తోడు మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మూడో త్రైమాసికంలో అందాల్సిన మందులు ఆలస్యం కావడం, ఈ సీజన్‌లో వ్యాధులు అధికంగా వ్యాపించడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
 
 వందలాది గొర్రెలు మృతి
 తొండూరు మండలంలో నీలినాలుక, గాలికుంటు వ్యాధితో ఇటీవల వందలాది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తొండూరు మండల కేంద్రంలోని వైద్యశాలలో రాంబాబు అనే డాక్టర్ ఉన్నారు. ఈయన వారంలో రెండుసార్లు మినహా విధులకు హాజరు కారు. శనివారం కూడా ఆయన విధులకు రాలేదు. ఇక్కడ గొర్రెల కాపరులు ఎక్కువ. నిత్యం ఏదోఒక సమస్యతో ఆస్పత్రికి రైతులు వస్తుంటారు. డాక్టర్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.
 
 సిబ్బంది వచ్చారు... రెండ్రోజుల్లో
 నియమిస్తాం: కే వెంకట్రావు. జేడీ,
 పశుసంవర్ధకశాఖ.
 వైద్యశాలల్లో పూర్తి సిబ్బంది ఉన్నారు. సబ్‌సెంటర్లలో మాత్రం ఖాళీల కొరత తీవ్రంగా ఉంది. 42మంది వెటర్నరీ అసిస్టెంట్లు అపాయింట్ అయ్యారు. రెండు, మూడురోజుల్లో వీరిని  ఆస్పత్రుల్లో నియమిస్తాం. తక్కిన ఖాళీలను కూడా త్వరలోనే పూరించేలా చర్యలు తీసుకుంటాం. మందులు వచ్చాయి. వర్షాకాలం కావడంతో ఉన్న మందులు త్వరగా అయిపోయాయి. వీటిని కూడా రెండ్రోజుల్లో వైద్యశాలలకు పంపిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.
 
 కొత్తచెరువు వద్ద శనివారం తెల్లవారు జామున దగ్ధమవుతున్న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగి ,  కాలిన బోగీని పరిశీలిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు