తెలంగాణ రాష్ట్రం ఖాయం మంత్రి సుదర్శన్‌రెడ్డి

10 Oct, 2013 07:07 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం వినూత్న పథకాలను రూపొందిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంతో పాటు పొతంగల్, మిట్టాపూర్, నందిగామ, తడగామ గ్రామాలలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీపేటలోని రఘుపతిరెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనుకునే నిశ్చయంతోనే రుణ సదుపాయాన్ని పెంచామన్నారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. సంఘాలలోని మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మరిన్ని సేవలను పొందవచ్చన్నారు. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. స్త్రీనిధి, బంగారుతల్లి పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను  సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మండలానికి రూ. 20 నుంచి రూ.30 లక్షలు ఇస్తామనే హామీ ఇచ్చారన్నారు. నిధులతో ఎంపిక చేసిన గ్రామాలలో భవనాలను నిర్మించుకోవాలన్నారు. స్త్రీనిధి సంక్షేమానికి వచ్చిన చెక్‌లను ఆయన మహిళా సంఘాల అధ్యక్షులకు ఆయన అందజేశారు.
 
 18న బోధన్‌లో కృతజ్ఞత సభ
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక ఆగదని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈనెల 18న బోధన్‌లో సభను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే సభకు అన్నివర్గాల వారు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కల్లు, మద్య పానాన్ని వీడి యువకులు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఐకేపీ పీడీ వెంకటేశ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు