ప్రియుని ఇంటి ముందు తెలంగాణ యువతి ఆందోళన

2 Jul, 2018 11:24 IST|Sakshi
శివ ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేస్తున్న యువతి కుమారి

న్యాయం చేయాలని డిమాండ్‌

రావికమతం: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ గ్రామానికి చెందిన యువతి కుమారి(22) ఆదివారం విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గ్రామానికి చెందిన ఆర్లె శివ (23) ఇంటి ముందు బైఠాయించింది. మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్‌ చేయడంతో రావికమతం ఎస్‌ఐ రామకృష్ణ ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ ఏడాది క్రితం నల్గొండలో బీటెక్‌ చదివాడు. అప్పట్లో అక్కడ కోదాడకు చెందిన తనతో పరిచయం ఏర్పడిందని, తనను నమ్మించి మోసం చేశాడని ఆమె పేర్కొంది.

దీనిపై ఏడాది క్రితమే కోదాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. అయితే శివ కేసు భయంతో ఇక్కడికి వచ్చేశాడని ఆమె వివరించింది. అతని అడ్రస్‌ తెలుసుకుని ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె శివ ఇంటిముందు బైఠాయించింది.దీంతో శివ, అతని కుటుంబసభ్యులను, యువతిని పోలీసుస్టేషన్‌కు రప్పించి విచారించామని ఎస్‌ఐ తెలిపారు. అయితే శివ మాత్రం తనకేమీ తెలియదని చెబుతున్నాడన్నారు. తెలంగాణలో కేసు నమోదైనందున ఇక్కడ కేసు నమోదు చేయమని చెప్పడంతో అక్కడే పరిష్కరించుకుంటామని ఇరువర్గాలు కోదాడ బయలుదేరి వెళ్లారని ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు