అమెరికాలో తెలుగు బిడ్డల విషాదాంతం

2 Jun, 2017 08:25 IST|Sakshi
అమెరికాలో తెలుగు బిడ్డల విషాదాంతం

కన్న బిడ్డను కాపాడబోయి.. ఈత కొలనులో మునిగి తండ్రీకుమారుడి మృతి

పట్నంబజారు (గుంటూరు తూర్పు): స్విమ్మింగ్‌ పూల్‌లో పడిన కన్నబిడ్డను రక్షించబోయి తండ్రి కూడా దుర్మరణం పాలైన ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలో మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. గుంటూరులోని నెహ్రూనగర్‌ పదో లైన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూరేపల్లి నాగరాజు(33), ఆయన కుమారుడు అనంతసాయి(3) మృత్యువాత పడ్డారు.

అనంతసాయి డెట్రాయిట్‌లోని తమ నివాసం వద్ద ఆడుకుంటూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి నాగరాజు కూడా కొలనులోకి దూకినట్లు సమాచారం. ఆయన సైతం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం ఐదడుగుల లోతు ఉండే స్విమ్మింగ్‌ పూల్‌లో పడి నాగరాజు ఎలా మరణించాడో అర్థం కావడం లేదని బంధువులు అంటున్నారు.

గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన సూరేపల్లి శివలింగయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నాగరాజు కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచాడు. బీటెక్‌ చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. చెల్లెళ్ల వివాహాలు చేసి చేదోడువాదోడు అయ్యాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హిమబిందును వివాహం చేసుకుని బెంగళూరులో ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు.  నాగరాజును ఇన్ఫోసిస్‌ యాజమాన్యం 2014 సెప్టెంబర్‌లో అమెరికాకు పంపించింది. కాగా ఈ నెల 6వ తేదీ నాటికి మృతదేహాలు గుంటూరుకు చేరే అవకాశాలు ఉన్నాయని బంధువులు తెలిపారు.

మరిన్ని వార్తలు