తెలుగు యువత నేత రాకేశ్‌ లీలలెన్నో..!

11 Jan, 2019 11:09 IST|Sakshi
మంత్రి లోకేశ్‌తో రాకేశ్‌

నిరుద్యోగుల నుంచి రూ.కోటి వసూలు

లోకేశ్‌తో ఉన్న ఫొటోలు చూపించి బురిడీ

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఓ వ్యాపారి కిడ్నాప్‌ కేసులో బుధవారం అరెస్టయిన తెలుగు యువత నేత రాకేశ్‌ బాగోతాలు ఒక్కొక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌తో చనువుగా ఉన్న ఫొటోలు చూపించి నిరుద్యోగుల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. రాకేశ్‌ అరెస్టు విషయం తెలిసిన బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

వివరాలు.. గుంటూరు జిల్లా నూజెండ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు శ్రీరామినేని రాకేశ్‌ విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు మంత్రులు, టీడీపీ నాయకులతో పరిచయాలను ఉపయోగించుకున్నాడు. విశాఖ సీతమ్మధార పీ అండ్‌ టీ కాలనీలో నివసిస్తున్నాడు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్‌ తెలుసు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ ఇక్కడి నిరుద్యోగులతో నమ్మబలికాడు. ఆయనతో దిగిన ఫొటోలు చూపించాడు. లోకేశ్‌ ఎంతో ఆప్యాయంగా రాకేశ్‌తో మాట్లాడుతున్న ఫొటోలు కావడంతో నిరుద్యోగులు కూడా నమ్మేశారు. అంతేకాదు మంత్రి గంటా శ్రీనివాస్, పరిటాల శ్రీరామ్‌ తదితరులతో తాను చనువుగా ఉన్న ఫొటోలు చూపించి వారి నుంచి రూ.కోటి వరకు వసూలు చేశాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్న రాకేశ్‌ను హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో.. నిరుద్యోగులను మోసం చేసిన విషయం బయటపడింది.

మరిన్ని వార్తలు