ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి వెల్లడి
తిరుపతి మెడికల్ : ఆరుగురు డాక్టర్లపై ఏపీ మెడికల్ కౌన్సిల్ తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నియమ నిబంధనలను ఉల్లంఘించినందున క్రమశిక్షణ చర్యల కింద 6 నెలలపాటు నిషేధం విధించినట్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు తెలిపారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన ఎముకల సర్జన్ డాక్టర్ సూర్యనారాయణరావు తనకు సంబంధంలేని ఆపరేషన్ చేశారన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు విచారించగా అది నిర్ధారణ అయిందన్నారు. దీంతో డాక్టర్ సూర్యనారాయణరావును 6 నెలలపాటు వైద్య వృత్తి చేయకుండా నిషేధించినట్లు తెలిపారు. అదేవిధంగా.. నిబంధనలకు విరుద్ధంగా 2015–16 సంవత్సరానికిగాను రెండు మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసిన అయిదుగురిపై కూడా తాత్కాలిక వేటు వేశారు. సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ, హైదరాబాద్ గడ్డిఅన్నారానికి చెందిన డాక్టర్ నరేంద్రులా సునీత, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన డాక్టర్ బి.వేణుగోపాల్రావు, హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన డాక్టర్ సాగర్ సుంఖ, గుంటూరు కన్నావారితోటకు చెందిన డాక్టర్ ఎస్. స్వరూపారాణిలపైన 6 నెలలపాటు నిషేధం విధించామన్నారు. వీరి పేర్లను ఏపీ మెడికల్ కౌన్సిల్కు పంపగా కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు తెలిపారు.