కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆగస్టులో టెండర్లు

2 Jun, 2020 03:18 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ఆసుపత్రులుండాలి 

వైద్య రంగంలో నాడు–నేడులో భాగంగా వీటి ఏర్పాటుపై సీఎం జగన్‌ సమీక్ష 

సూక్ష్మ స్థాయిలో ఆసుపత్రుల నమూనాల పరిశీలన.. మార్పులు, చేర్పులపై సూచనలు  

ప్రస్తుతం ఉన్న 11, కొత్తగా ఏర్పాటయ్యే 16 ఆసుపత్రులకు రూ.12,000 కోట్లు వ్యయం  

సాక్షి, అమరావతి: వైద్య రంగంలో నాడు–నేడులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 టీచింగ్‌ ఆసుపత్రుల రూపు రేఖలను మార్చేందుకు, కొత్తగా ఏర్పాటు చేయనున్న 16 టీచింగ్‌ ఆసుపత్రులకు ఆగస్టు కల్లా టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త ఆసుపత్రులు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఉండాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే సమస్యే లేదని స్పష్టం చేశారు. కొత్త ఆసుపత్రుల నమూనాలను ఇప్పటికే సూక్ష్మ స్థాయిలో పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించిన ఆయన సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నాడు–నేడు సమీక్షలో భాగంగా మరోసారి లోతుగా పరిశీలించారు. భవిష్యత్‌ అవసరాల రీత్యా విస్తరణకు కూడా అవకాశం ఉండేలా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో టీచింగ్‌ ఆసుపత్రుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల నమూనాల్లో మరికొన్ని మార్పులు, చేర్పులతో పలు సూచనలు చేశారు. 

ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలి
► ఆసుపత్రుల నమూనాల్లో మార్పులు, చేర్పులు వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) లను సిద్ధం చేయాలి. ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్లను పిలవాలి. ఈ లోగా అవసరమైన చర్యలను తీసుకోవాలి.
► మూడేళ్లలో పనులను పూర్తి చేయాలి. టీచింగ్‌ ఆసుపత్రుల్లో నర్సింగ్‌ కాలేజీతో పాటు పారా మెడికల్‌ కాలేజీ కూడా ఉండాలి. అందుకు అనుగుణంగా నమూనాలు ఉండాలి.
► టీచింగ్‌ ఆసుపత్రుల్లో అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌కేర్, మెడికల్‌ టూరిజం, పీజీ కోర్సులు ఉండాలి. ఇతరత్రా సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. 
► నమూనాలు, డిజైన్లు ఖరారు చేసే నాటికి స్థలాల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ తదితర అంశాలపై  దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్న 11 టీచింగ్‌ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చడంతో పాటు కొత్తగా 16 టీచింగ్‌ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.12,000 కోట్లు వెచ్చించనుంది.

మరిన్ని వార్తలు