సాక్షి, సత్తెనపల్లి/గుంటూరు : శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అవినీతికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కోడెల కుటుంబం అవినీతి, అరాచకాలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా నిలిచేందుకు సత్తెనపల్లి తాలుకా సెంటర్లో ధర్నా చేసేందుకు అఖిలపక్షం నిర్ణయించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సహా పలువురు సీపీఐ, సీపీఎం, జనసేన, ఆప్, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదని, ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందన్న కారణంతో అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.