హైదరాబాద్: ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా పలు ప్రాంతాలలో ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారు భర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అమీనాపురంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా నిడ్జూరులో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ సీపీ మద్దతుదారు లావణ్య గెలిచినా అధికారికంగా ప్రకటించలేదు. రీ కౌంటింగ్ నిర్వహించాలని అధికారులపై కేంద్ర మంత్రి కోట్ల సూర్య సూర్యప్రకాష్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లిలో కౌంటింగ్ కేంద్రంపై మహిళలు దూసుకెళ్లారు. సీల్ వేయకుండా కౌంటింగ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
వరంగల్ జిల్లా దేవరుప్పలలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ సహా మరో నలుగురు నాయకులపై కేసు నమోదు చేశారు.