టీడీపీలో మొదలైన టెన్షన్‌

11 Mar, 2019 08:11 IST|Sakshi

ఆ తొమ్మిది అసెంబ్లీలకు ఖరారు కాని టీడీపీ అభ్యర్థులు

తిరుపతి ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట

సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను ముగించేలా నిర్ణయం తీసుకుంది. ఆమేరకు ఆదివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పో లింగ్‌కు కేవలం నెలరోజుల సమయమే ఉండడంతో జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నెల రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో పూర్తిచేయాల్సి ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన వెలువడింది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌.. మే 23న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. పోలిం గ్‌కు నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో తిరుపతి పార్లమెంట్, చిత్తూరు, నగరి, పూతలపట్టు, శ్రీకాళహస్తి, తిరుపతి, గంగాధరనెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఇంకా ఖరారు చెయ్యలేదు. దీంతో ఆ స్థానాలను ఆశిస్తున్న వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 

అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు?
నెల రోజుల సమయంలో అభ్యర్థుల్ని ఎప్పుడు ఎంపిక చేస్తారు?, మేనిఫెస్టో తయారుచేసి ఎప్పుడు ప్రకటిస్తారని టీడీపీ శ్రేణులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్చి 18న నోటిఫికేషన్‌ రావడం.. మార్చి 25తో నామినేషన్లు వేసేందుకు సమయం ముగుస్తుండడం పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. అంటే 15 రోజుల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్‌ చేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేందుకు కూడా వారం సమయం మాత్రమే ఉండడం. ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండడం అధికార పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై నాన్చివేత ధోరణి అవలంభిస్తుండడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, జనసేన జిల్లాలో ఊసే లేకుండా పోయింది. 
 

జనం హర్షం
ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించిడంపై ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అరాచకాలు.. అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలతో విసిగి పోయిన జనం మాత్రం షెడ్యూల్‌ విడుదల కావడంతో జిల్లాలో కొందరు బాణా సంచాలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. నేటితో అరాచకపాలనకు తెరపడినట్లేనని సంబరపడుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు