వెబ్‌సైట్‌లో టెన్త్ ఫలితాల విశ్లేషణ

19 Aug, 2013 03:39 IST|Sakshi

చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ఉత్తీర్ణతా శాతం వచ్చిన పాఠశాలలపై మరింత దృష్టి పెట్టేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ www.deochittoor.orgలో జిల్లాలోని 602 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వచ్చిన పది ఫలితాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమీక్షించుకునే విధంగా వెబ్‌సైట్‌లో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 92.18 ఉత్తీర్ణతా శాతం ఉంది.
 
చొరవ తీసుకున్న కలెక్టర్
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చొరవ కారణంగానే వెబ్‌సైట్‌లో ఈ వివరాలు పెట్టారు. నెల రోజుల క్రితం ఆయన విద్యాశాఖ అధికారులతో దీనిపై మాట్లాడారు. వెబ్‌సైట్‌లో విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడిని పిలిపించి టెన్‌‌త ఫలితాలకు సంబంధించి ప్రోగ్రాం రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ సూచనల ప్రకారం 20 రోజుల పాటు కష్టపడి ప్రేమ్‌కుమార్ జిల్లా స్థాయిలో వచ్చిన ఫలితాలను, పాఠశాలలో వచ్చిన ఫలితాలతో పోలుస్తూ గ్రాఫ్‌లు రూపొందించి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇందులో మండలాల వారీగా పాఠశాలలు, గత ఏడాది అవి పది పరీక్షల్లో సాధించిన ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉంటాయి. వీటి ఆధారంగా తమ పాఠశాల విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో గమనించి దానిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది.  ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఏం చేయాలో  ప్రణాళికలు వేసుకోవచ్చు.
 
 హెచ్‌ఎంలందరూ సమీక్ష జరపాలి
 ఇది జిల్లా కలెక్టర్ ఆలోచనల రూపం. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ www.deochittoor. org వెబ్‌సైట్‌లో పెట్టిన ఫలితాలను చూసుకొని తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్టులో ఎందుకు ఇలా జరిగిందని ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించాలి.                 
-బి.ప్రతాప్‌రెడ్డి, డీఈవో
 
 కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు
 ఈ కార్యక్రమంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చాలాసార్లు పిలిపించి మా ట్లాడి దీనికి ఒకరూపం తెచ్చారు. ఈ పనిచేసే సమయంలో ఎప్పటికప్పుడు పని ఎంతవరకు వచ్చిందని ఆరా తీ స్తూండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తోనే ఈ వెబ్‌సైట్‌ను ఇంత త్వరగా రూపొందించాము. వచ్చే విద్యాసంవత్సరంలో టెన్‌‌తలో ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది.
 -ప్రేమ్‌కుమార్, డీఈవో కార్యాలయం అధికారిక వెబ్‌సైట్ రూపకర్త
 

మరిన్ని వార్తలు