జిల్లాలో 267 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు

3 Mar, 2014 03:33 IST|Sakshi

మదనపల్లె అర్బన్, న్యూస్‌లైన్:  జిల్లాలో 267 కేంద్రాల్లో 53వేల841 మం ది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈవోప్రతాప్‌రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం 250 పరీక్ష కేంద్రాల్లో 51వేల445 మంది రెగ్యులర్ విద్యార్థులు, 17 ప్రయివేటు పరీక్ష కేంద్రాల్లో 2,396 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు.

జిల్లాలో 67 సీ క్యాటగిరి పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, అక్కడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈనెల 14, 15తేదీల్లో తొలివిడత ప్రశ్నపత్రా లు, 21, 22 తేదీల్లో రెండవ విడత ప్రశ్నపత్రాలను పంపిణీ చేయునున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి సౌకర్యంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా అధికారులతో మాట్లాడతామన్నారు. సమావేశంలో డీవైఈవో శ్యామ్యూల్ కూడా పాల్గొన్నారు.
 
బెంచీలు ఏర్పాటు చేయాలి

 
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయాలని మండల విద్యాశాఖాధికారులను డీఈవో ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం డివిజన్‌లో చీఫ్ సూపరింటెం డెంట్లు, డిపార్టుమెంటు అధికారులకు పరీక్షల నిర్వహణపై శిక్షణ  ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు.

విద్యార్థుల్లో భయం పోగొట్టి ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి సిద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులను పరిశీలన పేరుతో ఇబ్బంది పెట్టకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్షలు రాయకూడదన్నా రు. పరీక్ష  కేంద్రం లేని ప్రయివేటు పాఠశాలలో ఉన్న ఫర్నీచర్‌ను రవాణా చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో చీకటి లేకుండా చూడాలని, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలలో జరిగే టెస్టులపై మూడు రోజులకు ఒకసారి తప్పనిసరిగా తనకు మెసేజ్ పెట్టాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో డీవైఈవో శ్యామ్యూల్, పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు నిరంజన్, ఆనంద్, డివిజన్ లోని చీఫ్‌సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు