ప్రశాంతంగా టెట్

17 Mar, 2014 02:33 IST|Sakshi

  పేపర్ 1కు 89%, పేపర్ 2కు 86%హాజరు
  ఓఎంఆర్ షీట్లపై పాత తేదీ
  తిరుపతిలో పరీక్ష రాస్తూ పట్టుబడిన టీచర్లు
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆది వారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 89% (56,546 మంది), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 86.17% (3,39,251 మంది) అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు పేపర్-1, బీఎడ్ అభ్యర్థులు పేపర్ -2 రాయడానికి అర్హులు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు దాదాపు 7 వేల మంది ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా టెట్ పలుమార్లు వాయిదా పడడం తెలిసిందే. పరీక్ష వాయిదా పడినా.. ఓఎంఆర్ జవాబు పత్రాలపై తేదీని మాత్రం విద్యాశాఖ మార్చలేదు. పాత తేదీతో ముద్రించిన పత్రాల్నే అభ్యర్థులకిచ్చారు. బోధనేతర సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిబంధన ఉన్నా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇది అమలు కాలేదు. బోధనా సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా వినియోగించారు. తిరుపతిలో ముగ్గురు టీచర్లు పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పేపర్ -1 మ్యాథ్స్‌లో ‘స్పిరిట్ ఆఫ్ జామెట్రీ’ గ్రంథ రచయిత ఎవరు? అనే ప్రశ్నకు.. జవాబు గుర్తించడానికిచ్చిన 4 ఆప్షన్ల(రెనె డెకాట్రే, యూక్లిడ్, జార్జ్ కాం టర్, బ్లైజా పాస్కల్)లో సరైన జవాబు(రెనె మాగ్రిటే) లేదు.

 రెండ్రోజుల్లో ‘కీ’ విడుదల: టెట్ ప్రాథమిక కీ రెండు రోజు ల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశ్న పత్రాల్లో తప్పులున్నట్లు గుర్తిస్తే.. ఆ ప్రశ్నలకు అభ్యర్థులందరికీ గ్రేస్ మార్కులు ఇస్తామని చెప్పారు. టెట్ ఫలితాలు ఏప్రిల్ 2న ప్రకటించడానికి ప్రయత్నిస్తామన్నారు. సాధ్యం కాకపోతే ఏప్రిల్ తొలివారంలో విడుదల చేస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు