ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా

27 Oct, 2017 08:40 IST|Sakshi

కంచ ఐలయ్యకు ఎంపీ టీజీ వెంకటేష్ సవాల్‌

సాక్షి, కర్నూలు (టౌన్‌): ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సవాల్‌ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని పదే పదే దూషిస్తే తిరగబడతామని కంచ ఐలయ్యను హెచ్చరించారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని బనియా సంపన్నులతో ఆర్యవైశ్యులను పోల్చడం ఎంత వరకు సమంజసమన్నారు. ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై సుప్రీం కోర్టు కేసును డిస్మిస్‌ చేయలేదని, కేవలం డిస్పోజ్‌ చేసిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

ఈ కేసు త్వరలోనే పరిశీలనకు వస్తుందని వెంకటేశ్‌ తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్న ఐలయ్య వెనుకబడిన వర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశానికి వత్తాసు పలికే ఐలయ్యకు కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడం బాగానే ఉందని, వారిలోనూ మార్పు తీసుకొచ్చినందుకు ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు