బాధిత కుటుంబాలకు బాసటగా..

27 Jun, 2015 03:16 IST|Sakshi

గంగవరం : రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద ఈ నెల 4న పెళ్లి వ్యాను బోల్తా పడ్డ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చి, వారిలో మనోధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై మొదటి వారంలో రానున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. జగన్ పర్యటన నేపథ్యంలో  శుక్రవారం ఆయన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు తదితరులతో కలసి మండలంలోని సూరంపాలెం, కొత్తాడలలో పర్యటించారు. జగన్ పర్యటన రూట్‌ను పరిశీలించారు.
 
 జగన్ పర్యటన విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా జ్యోతుల సూరంపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ పెళ్లివ్యాను బోల్తా ఘటనలో సూరంపాలెంకు చెందిన 8 మంది, కొత్తాడకు చెందిన ఒకరు మృతి చెందడం, అనేకులు గాయపడడం విచారకరమన్నారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్ ఈ నెల 10నే బాధితుల పరామర్శకు రావలసి ఉండగా అదే రోజు ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లడంతో రాలేకపోయారన్నారు.
 
 వచ్చే నెల మొదటి వారంలో రానున్న ఆయన సూరంపాలెంలో మృతుల కుటుం బాలను, క్షతగాత్రులను పరామర్శించాక కాకినాడలో  మత్య్సకార కుటుంబాలను కూడా పరామర్శిస్తారన్నారు. ఆయన వెంట  పార్టీ నాయకులు కల్లం సూర్యప్రభాకర్,  డాక్టర్ చిన్నస్వామి,  జనపరెడ్డి సుబ్బారావు(బాబు),  యెజ్జు వెంకటేశ్వరరావు,  అత్తిలి సీతారామస్వామి,  బలుమూరి సత్యనారాయణ, శెట్టిబత్తుల రాజబాబు, ఏడుకొండలు, తోట రాజేశ్వరరావు,  నారాయణరావు,  శారపు కామరాజుదొర, బాబి, గోడి వీర్రాజు, తిరుపతిరావు, శ్రీను, అప్పలకొండ తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు