డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం

23 May, 2017 19:45 IST|Sakshi
డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం

గిద్దలూరు : డప్పుల్లో పెట్టి రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గిద్దలూరు రైల్వే పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మూడు డప్పుల్లో గంజాయిని కుక్కి రైలులోని సీటు కింద ఉంచి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై నాగభూషణం తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు డప్పుల్లో ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయి తరలించేందుకు కొత్త పంధాను ఎన్నుకున్నారు.

గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో స్టెప్నీ టైర్లలో గంజాయి ఉంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటుండటంతో స్మగ్లర్లు సరికొత్త విధానంలో డప్పుల్లో గంజాయి ఉంచి రైలులో తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా సీట్ల కింద ఉన్న డప్పులను గమనించిన ప్రయాణికులు.. ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ గుట్టురట్టయింది. ఆ డప్పులు ఎవరివని పోలీసులు ప్రశ్నించినా.. అందరూ తమవి కావని చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. వాటిలో నాసిరకం గంజాయి ఉందని, ఇది కిలో రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర పలకదని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు